YS Jagan: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్దం బస్సు యాత్రకు నేడు (శుక్రవారం) విరామం ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని చింతారెడ్డిపాలెం దగ్గర క్యాంప్ లో జగన్ బస చేయనున్నారు. ఇవేళ పార్టీ ముఖ్య నేతలతో జగన్ సమావేశం కానున్నారు. నెల్లూరు జిల్లా నేతలతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడతారు.
నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్పీప్ చేసింది. అయితే నెల్లూరు జిల్లా నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహా పలువురు వైసీపీ కీలక నేతలు పార్టీ వీడారు. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, జనసేనలో అసంతృప్తి నేతలను వైసీపీలో చేర్చుకునేందుకు నెల్లూరు వైసీపీ లోక్ సభ అభ్యర్ధి విజయసాయి రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు.
ఇవేళ నెల్లూరు జిల్లా నేతలతో నిర్వహించే సమావేశంలో జరగబోయే ఎన్నికల్లో పది నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా చేయాల్సిన ప్రయత్నాలపై జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లాలోని ముఖ్యనేతలకు క్యాంప్ సైట్ వద్దకు రావాలని పిలుపు వెళ్లింది. దీంతో నేతలు క్యాంప్ సైట్ కు చేరుకుంటున్నారు. అలానే రాయలసీమ జిల్లాల యాత్రపై సమీక్ష నిర్వహించనున్నారు జగన్.
గత నెల 27న ఇడుపులపాయ నుండి ప్రారంభమైన బస్సు యాత్ర .. వైఎస్ఆర్ కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ముగిసింది. ప్రజల నుండి వచ్చిన అభ్యర్ధనలు, సలహాలు – సూచనల మేరకు కొత్త పథకాలను మేనిఫెస్టో లో ప్రవేశపెట్టే అంశంపై చర్చించే అవకాశం ఉంది.
రేపు (శనివారం) తొమ్మిదవ రోజు బస్సు యాత్రలో సీఎం జగన్ పాల్గొంటారు. నెల్లూరు బైపాస్ చింతరెడ్డిపాలెం బస చేసిన ప్రాంతం నుండి శనివారం బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది. శనివారం సాయంత్రం కావలిలో సిద్దం బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు.
YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా