తెలంగాణ రాష్ట్రం పాలమూరు జిల్లాలో ఈ రోజు తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల్లో జరిగిన ప్రమాదం కారణంగా అయిదుగురు బీహార్ కు చెందిన కార్మికులు మృతి చెందారు. కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం నాగర్ కర్నూలు జిల్లా కొల్లపూర్ మండలం రేగుమాన్ గడ్డ వద్ద భారీ వ్యయంతో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు నిర్వహిస్తొంది. ఇక్కడ నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ వద్ద బీహార్ కు చెందిన కూలీలు పనులు చేస్తుంటారు. శుక్రవారం ఎత్తిపోతల పథకం పనుల్లో అపస్తృతి చోటుచేసుకుంది.
పంప్ హౌస్ లోకి క్రేన్ దించుతుండగా ఒక్క సారిగా తీగలు తెగిపడి అయిదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఇంకా ఎవరైనా గాయపడ్డారా అనే సమాచారం తెలియరాలేదు. ప్రమాదంలో మరణించిన వారు అందరూ బీహార్ కు చెందిన కూలీలుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే కార్మికులు మృతి చెందిన సమాచారాన్ని పోలీసులు గానీ, కాంట్రాక్ట్ ప్రతినిధులు గానీ అధికారికంగా ఇంత వరకు దృవీకరించలేదు.