AP CM YS Jagan: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించారు. నిన్న విద్యుత్ ప్రాజెక్టుల శంకుస్థాపన చేసిన జగన్ ఇవేళ క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్ పద్దతిలో ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో రూ.1,100 కోట్ల విలువైన పెట్టుబడులతో పలు పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ పరిశ్రమల వల్ల 21 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మొత్తం తొమ్మిది ప్రాజెక్టుల్లో మూడు పరిశ్రమలను ప్రారంభించగా, మరో ఆరు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
ఇప్పటి వరకూ సీఎం జగన్ సంక్షేమంపైనే దృష్టి పెట్టి అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారన్న అపవాదు ఉండగా, ఇక అభివృద్ధినే దృష్టి పెట్టినట్లుగా అడుగులు కనబడుతున్నాయి. మరో పక్క చిత్తూరు జిల్లా పుంగనూరులో రూ. 4,640 కోట్లతో 800 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్సు, ట్రక్ క్లస్టర్ యూనిట్ను జర్మనీకి చెందిన ప్రముఖ తయారీ సంస్థ పెప్పర్ మోషన్ ఏర్పాటు చేయనున్నది. అతి త్వరలో భూమిపూజకు సిద్దమవుతున్న సదరు కంపెనీ సీఈవో ఆండ్రియాస్ హేగర్ తమ అధికారుల బృందంతో బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంలో గ్రీన్ ఎనర్జీకి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పారిశ్రామిక విధానాలు, సింగిల్ విండో అనుమతులు, పారదర్శక విధానాలపై పెప్పర్ మోషన్ ప్రతినిధులతో సీఎం జగన్ చర్చించారు. ఏడాదికి 30,000 ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులు తయారీ సామర్ధ్యం, ఇంటిగ్రేటెడ్ వర్టికల్ ప్రొడక్షన్ ఫెసిలిటీ, 20 జీడబ్ల్యూహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీల నుంచి ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కుల తయారీ, డీజిల్ బస్సులు, ట్రక్కులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే రిట్రో ఫిట్టింగ్, 20 జీడబ్ల్యూహెచ్ సామర్ధ్యం ఉండే బ్యాటరీ తయారీ యూనిట్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్నట్లు పెప్పర్ మోషన్ సీఈవో సీఎం జగన్ కు తెలిపారు. ఏపీలో ఏర్పాటు చేస్తున్న యూనిట్కు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి సీఎంకు సీఈవో కృతజ్ఞతలు తెలియజేశారు.
ఏపీలో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఏషియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా వంటి దేశాల్లోని పెప్పర్ భాగస్వామ్యులకు కూడా ఇక్కడి నుంచే సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ పరిశ్రమల ద్వారా 8,100 మంది ఇంజినీర్లు, టెక్నీషియన్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, డాక్టర్ మథియాస్ కెర్లర్ (పెప్పర్ మోషన్ సీటీవో), ఫైనాన్స్ డైరెక్టర్ ఉవే స్టెల్టర్, ఉర్త్ ఎలక్ట్రానిక్ ఇండియా ఎండీ హర్ష ఆద్య, పెప్పర్ మోషన్ సీఐవో రాజశేఖర్ రెడ్డి నల్లపరెడ్డి, సీఎస్వో సత్య బులుసు, సీసీవో రవిశంకర్, అసోసియేట్ శ్రీధర్ కిలారు, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.
అనంతరం ఆండ్రియాస్ హేగర్ మీడియాతో మాట్లాడుతూ..ఏపీలో వరల్డ్ క్లాస్ యూనిట్ ఏర్పాటు చేయడంపై చాలా సంతోషంగా ఉన్నామన్నారు. అత్యంత అధునాతన టెక్నాలజీతో ఇక్కడ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. ప్రజా రవాణాకు అవసరమైన విధంగా డీకార్బొనైజ్డ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ తీసుకువచ్చేలా తమ యూనిట్ నుంచి వాహనాల ఉత్పత్తి జరుగుతుందన్నారు. ఏపీలో యూనిట్ ఏర్పాటు చేయడం సరైన నిర్ణయంగా భావిస్తున్నామన్నారు. బెంగళూరు, చెన్నై నగరాలకు దగ్గరగా తమ యూనిట్ ను ఏపీలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం తమకు అందిస్తున్న సహాయ సహకారాలు మరవలేనివని అన్నారు. సీఎం విజనరీ థింకింగ్, పాలసీలు తమను ఆకట్టుకున్నాయమని అన్నారు.
Cabinet Meet: పేదలు, డ్వాక్రా మహిళలకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ .. కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే