ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు ఊహించని పరిణామంతో వార్తల్లోకి ఎక్కారు.
అకస్మాత్తుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీ బయల్దేరారు. సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తారు. ఆయనతో పాటు మరికొందరు కేంద్రమంత్రులను జగన్ కలవనున్నారు.
రాజధాని విషయంలో
ఏపీలో పాలనా వికేంద్రీకరణ పేరిట అక్కడ శాసన రాజధాని అనేదాన్ని మాత్రం కొనసాగిస్తూ పాలనా రాజధానిని విశాఖకు తరలించాలని , న్యాయ రాజధాని పేరుతో కర్నూలుకు హైకోర్టు తరలించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పలు వివాదాలు తెరమీదకు వచ్చినా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని మార్పు విషయంలో పట్టుదలతో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, కొందరు బీజేపీ నేతలు `రాజధాని అమరావతిలోనే ఉంటుంది. అవసరం అయితే కేంద్రం జోక్యం చేసుకుంటుంది“ అని స్టేట్మెంట్లు ఇస్తున్నప్పటికీ కేంద్రం మాత్రం ఇప్పటికే అనేక దఫాలుగా క్లారిటీ ఇచ్చింది.
బీజేపీ నేతలను కాదని… జగన్కు కేంద్రం సపోర్టు
గత కొద్దికాలంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తూ వస్తోంది. వివాదం చెలరేగుతున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మద్దతు ఇవ్వడంతో…వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరనుందా? అనే చర్చ మొదలైంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.
జగన్ నిర్ణయాల వెనుక కేంద్రం
మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో బీజేపీ పెద్దలకు తెలిసే, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని , గతంలో అమరావతి రూపంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన చర్యలను గమనించిన బీజేపీ పెద్దలు ఈ మేరకు ఆయనకు అండగా నిలుస్తున్నారని కొందరు అంటున్నారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తే, ఏనాటికైనా ఎన్డీఏ గూటికి వైసీపీ చేరుతుందేమో అంటూ ఇంకొందరు ఊహాగానాలు వినిపించాయి. ఇలాంటి తరుణంలో హఠాత్తుగా ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.
కేంద్రం నిధుల కోసమేనా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన, ప్రస్తుతం కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను వివరిస్తూ కొద్దికాలం క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రూ.3,805 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయడానికి సహకరించాల్సిందిగా కోరారు. పోలవరం ప్రాజెక్ట్ నిధుల విడుదల ప్రక్రియ సంక్లిష్టంగా ఉన్నందున నిధుల విడుదలలో విపరీతమైన జాప్యం చోటు చేసుకుంటోంది. కాబట్టి ఈ ప్రక్రియను సులభతరం చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి తన లేఖలో ప్రధానమంత్రిని కోరారు. వీటి గురించి మరోమారు కేంద్రం దృస్టికి తీసుకువచ్చేందుకు వైఎస్ జగన్ టూర్ పెట్టుకున్నారా? అనే చర్చ సైతం జరుగుతోంది.