కాగల కార్యం గంధర్వులు తీరిస్తే సంతోషించని వారు ఎవరుంటారు? ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఇందుకు అతీతమేమీ కాదు. ఉదయం లేస్తే తన పాలన పై విమర్శనాస్త్రాలు
సంధిస్తూ చికాకుపెట్టే ఈనాడు పత్రిక అధినేత రామోజీరావు పై ముఖ్యమంత్రి కి కోపం ఉండకుండా ఉండదు. అలాంటి ఈనాడు పత్రిక అధినేత రామోజీరావు పైన కేసు పడితే సీఎం జగన్ ఖుషి గాకు౦డా ఉంటారా? ఆ పని చేసి పెట్టిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కి జగన్ లోలోపలే థాంక్స్ చెబుతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. నిజానికి ఇటీవల ఉండవల్లి తనదైన శైలిలో జగన్ ప్రభుత్వ ఏడాది పాలన పై కొన్ని చురకలు వేశారు. వైసిపి వారికి కోపం కూడా వచ్చింది. అయినా జగన్ తండ్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తుడైన ఉండవల్లి విషయంలో వారు తొందరపడలేదు ఎటువంటి కామెంట్ చేయలేదు. ఇదిలా ఉండగానే మార్గదర్శి కేసు వెలుగులోకి వచ్చింది.
ఈనాడు అధినేత రామోజీరావు మరో సంస్థ అయిన ‘మార్గదర్శి’ రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా 2,600 కోట్ల రూపాయల మేరకు డిపాజిట్లు సేకరించడానికి వ్యతిరేకంగా ఉండవల్లి ఎంపీగా ఉన్నప్పటి నుంచి పోరాడుతున్నారు. హైకోర్టులో కేసు వేయగా దాన్ని కొట్టివేశారు. ఈ లోపు రామోజీరావు జాగ్రత్త పడి తన ఆస్తులను అమ్ముకొని 2,600 కోట్ల రూపాయలను డిపాజిటర్లకు చెల్లించేశారు. ఆయినా నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించినందున రామోజీరావు శిక్షార్హులే అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ న్యాయపోరాటం కొనసాగిస్తూ తాజాగా సుప్రీం కోర్టు లో పిటిషన్ వేశారు.చట్టంలోని సెక్షన్ 45(ఎస్)ను సరిగ్గా అన్వయించలేదని ఉండవల్లి అంటున్నారు.
హిందూ అవిభక్త కుటుంబం కింద ఉన్న సంస్థలకు డిపాజిట్లు సేకరించే అధికారం లేదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు రామోజీరావు తదితర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్గా ఉన్న ఉండవల్లి అభ్యర్థన మేరకు.. ఆర్బీఐను కూడా ప్రతివాదిగా చేర్చారు. ఇప్పటికైతే జరిగింది ఇదే గాని ఈ మాత్రానికే జగన్ చాలా హ్యాపీగా ఉన్నారని, మార్గదర్శి కేసు మళ్లీ వెలుగులోకి రావడం పట్ల ఆయన ఖుషి అవుతున్నారని వైసిపి వర్గాలు చెబుతున్నాయి