Kathi Mahesh: కత్తి మహేశ్ Kathi Mahesh రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 15 రోజులుగా చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి శనివారం కన్నుమూశారు. చిత్తూరు జిల్లా పీలేరులో పుట్టి పెరిగారు. తండ్రి వ్యవసాయ శాఖలో అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు ఒక అన్న, చెల్లి ఉన్నారు. ఆయన సినీ ప్రస్థానంలో మజిలీలు పరిశీలిస్తే.. నటుడిగా ప్రేక్షకులకు తెలిసినా ఆయన నటన కోసం పరిశ్రమకు రాలేదు. దర్శకుడు కావాలని వచ్చి.. నటుడయ్యారు. అంతకంటే ముందు టీవీ, యూట్యూబ్ చానెల్స్ లో సినీ విశ్లేషకుడిగా ప్రేక్షకులకు సుపరిచితులు. అయితే.. ఆయనకు బాగా గుర్తింపు తెచ్చింది ఎన్టీఆర్ హోస్ట్ గా జరిగిన మొదటి బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో.
మైసూర్ రీజనల్ కాలేజీలో ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ లో డిగ్రీ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో మాస్ కమ్యూనికేషన్స్ చేశారు. మహేశ్ కు చిన్ననాటి నుంచీ సినిమాలంటే ఆసక్తి ఎక్కువ. వేసవి సెలవుల్లో రోజుకో సినిమా చూసేవారట. సినిమా బాలేదని టాక్ వస్తే.. ఎందుకు బాలేదో చూద్దామని సినిమా చూసేవారట. దర్శకుడు రాఘవేంద్రరావు ప్రొడక్షన్ హౌస్ లో ‘రాఘవేంద్ర మహత్యం’ సీరియల్ కు పని చేశారు. 10 ఎపిసోడ్స్ కు పని చేసాక వచ్చే డబ్బులు చాలక చిత్తూరు వెళ్లిపోయి యూనిసెఫ్, సేవ్ ది చిల్డ్రన్, వరల్డ్ బ్యాంక్.. వంటి ఎన్జీవో సంస్థల్లో చేరారు. మళ్లీ సినిమా రంగంలోకి వచ్చి అనేక ప్రయత్నాల అనంతరం బాలగంగాధర తిలక్ ‘ఊరి చివర ఇల్లు’ స్క్రిప్ట్ రాసుకుని షార్ట్ ఫిలిం తీశారు.
నిర్మాత సాయి రాజేశ్ స్నేహితుడు కావడంతో హృదయకాలేయం సినిమాలో అవకాశం ఇచ్చారు. మంచి పేరు రావడంతో సినిమా అవకాశాలు వచ్చాయి. కొబ్బరిమట్ట సినిమాలో ఆయనపై నగర బహిష్కరణ సన్నివేశం జరుగుతున్న సమయంలో ఆయన నిజంగానే నగర బహిష్కరణలో ఉన్నారు. స్వీయ దర్శకత్వంలో మంచి సందేశాత్మక చిత్రం తీయాలనే కత్తి మహేశ్ కల నెరవేరకుండానే మృతి చెందడం అందరినీ కలచివేసింది. కత్తి మహేశ్ భార్య బెంగాలీ. యూనిసెఫ్ లో జాతీయస్థాయి వర్క్ షాప్ లో జరిగిన వారి పరిచయం ప్రేమ, పెళ్లి వరకూ వెళ్లింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన అంత్యక్రియలు చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం మండలంలోని యలమందలో రేపు జరుగనున్నాయి.