సోషల్ మీడియా పరిచయాలు అంత మంచివి కావని మరోసారి ప్రూవ్ అయింది. అమ్మాయిల పేరుతో అబ్బాయిలు.. మాట్లాడుకోవడం.. గొడవలు, నేరాలు.. ఇలా చాలా జరిగాయి.. జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇటువంటి పరిచయం ఓ నటి ప్రాణం మీదకు తెచ్చింది. సోషల్ మీడియాలో స్నేహం పేరుతో ఏర్పడిన పరిచయం పెళ్లి వరకూ వెళ్లింది. నటిని పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తికి నో చెప్పడంతో హత్యాయత్నం వరకూ వెళ్లింది. ముంబైలోని వెర్సోవా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ముంబైలో పలు హిందీ సీరియల్స్ లో నటిస్తోంది మాల్వి మల్హోత్రా. సోషల్ మీడియాలో ఆమెకు ఓ సందర్భంలో కుమార్ మహిపాల్ సింగ్ పరిచయం అయ్యాడు. వారిమధ్య మాటలు కలిసి స్నేహితులయ్యారు. తనను ఓ నిర్మాతగా మాల్వితో పరిచయం పెంచుకున్నాడు. కొన్నాళ్లు స్నేహంగా మెలిగారు. అనంతరం మహిపాల్ పెళ్లి ప్రస్తావన తీసుకురాగా మాల్వి ఇందుకు అంగీకరించలేదు. పైగా మహిపాల్ తీరు సరిగా లేకపోవడంతో మాట్లాడటం కూడా మానేసింది. సోషల్ మీడియా అకౌంట్ నుంచి మహిపాల్ ను బ్లాక్ చేసింది కూడా. అయితే.. మహిపాల్ ఆమెను వదల్లేదు. ఆమెపై కక్ష పెంచుకున్నాడు. అక్టోబర్ 26.. సోమవారం రాత్రి మాల్వీ ఓ కాఫీ షాప్ నుంచి బయటకొస్తున్న మాల్విని అడ్డగించాడు. ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాగా తనకు మాట్లాడటం ఇష్టం లేదని చెప్పింది.
దీంతో కోపంతో తనతో తెచ్చుకున్న కత్తితో మాల్విపై దాడి చేశాడు. ఆమె ఛాతీ కింది భాగం, పొట్ట, ఎడమ చేయి భాగంలో మూడు సార్లు పొడిచాడు. వెంటనే తాను వచ్చిన ఆడీ కారులోనే అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే తేరుకున్న స్థానికులు ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్ర గాయాలైన మాల్వీని కోకిలాబెన్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మాల్వీ చికిత్స పొందుతోంది. ఆమెకు ప్రాణాపాయం తప్పింది. నిందితుడిపై వెర్సోవా పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి అతడి కోసం గాలింపు చేపట్టారు. మాల్వీ ఉడాన్ అనే టీవీ షో, హోటల్ మిలాన్ అనే సినిమాలో నటించింది.