YSRCP: వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి, పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు లేఖను పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ కు పంపారు. దీన్ని తక్షణమే ఆమోదించాలని కోరారు. వ్యక్తిగత కారణాల వల్లే వైసీపీని వీడుతున్నట్లుగా లేఖలో పేర్కొన్నారు.
వేమిరెడ్డి ఇవేళ కీలక ప్రకటన వెలువరిస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంలో ఆయనను మీడియా ప్రశ్నించగా, ప్రస్తుతం తానేమీ మాట్లాడనని, తర్వాత అన్ని విషయాలు మాట్లాడతానని చెప్పారు. కాగా, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి సతీమణి ప్రశాంతి టీటీడీ బోర్డు సభ్యురాలిగా ఉన్నారు. ఆమె కూడా అధికార వైసీపీకి బైబై చెప్పేసినట్లు తెలుస్తొంది.
వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని ఇంతకు వైసీపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్ధిగా ప్రకటించింది. తాను లోక్ సభకు పోటీ చేస్తున్నట్లుగా ఆయన గతంలో ప్రకటన కూడా చేశారు. అయితే అనంతర జరిగిన పరిణామాలతో పార్టీ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల నెల్లూరు టౌన్ వైసీపీ ఇన్ చార్జిగా ఎండీ ఖలీల్ నియామకం విషయంలో కనీసం తనకు సమాచారం ఇవ్వకపోవడంతో వేమిరెడ్డి మనస్థాపానికి గురైనట్లు తెలుస్తొంది. అప్పటి నుండి ఆయన వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ పార్టీ వీడేందుకు సిద్దమైయ్యారు. దీంతో గత కొద్ది రోజులుగా వేమిరెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా వార్తలు వెలువడ్డాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారని కూడా సమాచారం. ఈ క్రమంలోనే ఆయన పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
PM Modi: మేడారం జాతర .. ప్రధాని మోడీ శుభాకాంక్షలు