విశాఖ లో జరిగిన ఒక సంఘటనను సోషల్ మీడియాలో టిడిపి వక్రీకరించి చూపి అడ్డంగా జనాలకు దొరికిపోయింది.ఈ విషయంలో ప్రతిపక్ష నేత,టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బుక్కయ్యారు.
శనివారం విశాఖలో జరిగిన ఒక సంఘటనను సోషల్ మీడియాలో హైలెట్ చేస్తూ అదంతా వైసిపి నేతల గూండాయిజం అన్నట్లు టిడిపి చిత్రీకరించింది.దీనికి ఏపీ పోలీసులు గట్టి కౌంటర్ ఇచ్చారు.తప్పుడు ప్రచారాలు మానుకోవాలని మాజీ ముఖ్యమంత్రి కే పోలీసులు సలహా ఇవ్వడం జరిగింది.అసలు జరిగిందేమిటంటే శనివారం వైసిపి నేతలు,కార్యకర్తలు విశాఖపట్నం లో ఒక నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా విధుల్లో ఉన్న ఒక సీఐపై వైసిపి గూండాలు దాడి చేశారంటూ టీడీపీ సోషల్ మీడియాలో ఉద్ధృత ప్రచారం సాగించింది.రాష్ట్రంలో ఎక్కడ శాంతిభద్రతలు వున్నాయంటూ జగన్ ప్రభుత్వాన్ని నిలదీసింది.
దీనిపై చంద్రబాబు ఆవేశంగా ఒక ట్వీట్ కూడా విసిరేశారు. అయితే వెనువెంటనే ఏపీ పోలీసులు స్పందించి అసలు విషయం వెల్లడించడంతో చంద్రబాబుతో సహా టీడీపీ నేతలందరూ ముఖం చాటేయాల్సిన పరిస్థితి తలెత్తింది.టీడీపీ ఏ పోలీసు అధికారి పైనైతే వైసిపి గూండాలు దాడి చేశారని సోషల్ మీడియాలో టిడిపి పోస్ట్ చేసిందో అదే సీఐ ఇమ్మాన్యూల్ రాజు ఈ సంఘటనపై వివరణ ఇచ్చారు.తనపై వైసిపి నేతలు దాడి చెయ్యలేదని నిజానికి వారు తనకు ఉపశమన చర్యలు చేశారని ఆయన చెప్పారు.
ఈ సంఘటనపై ఇమ్మాన్యూల్ రాజు వివరణ ఇస్తూ ‘నిరసన కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉన్న వారిని టార్గెట్ చేసి వెనక్కి లాగుతాం..ఓ పర్సన్ని లాగే క్రమంలో వెనుక నుంచి వచ్చిన ఓ ఆటో తగిలి కిందపడిపోయానని,వెంటనే ప్రదర్శనకారులలో వున్న రమేశ్ అనే వ్యక్తి..వచ్చి తనను పైకి లేపి..తలకు గాయమైందా..అని చేయి పట్టి మసాజ్ చేశాడని తెలిపారు. అయితే..దీనికి సంబంధించిన ఫొటోను తీసుకుని అనవసరంగా..పోలీసులపై దాడి చేశారంటూ టిడిపి నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల పోలీసుల మనోధైర్యం దెబ్బతింటుందని ఇమ్మాన్యూల్ రాజు తెలిపారు . ఎవరు తప్పుచేసినా..చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఐ హెచ్చరించారు.ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వీడియోను పోలీసులు మీడియాకు విడుదల చేశారు.దీంతో తెలుగుదేశం పార్టీ నాలుక కరుచుకోక తప్పలేదు.