Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. రాహుల్ పాదయాత్ర రెండో రోజు నారాయణపేట జిల్లా ముక్తల్ కేవి సబ్ స్టేషన్ నుండి యల్లగండ్ల వరకూ 26 కిలో మీటర్ల మేర సాగింది. జోడో యాత్రలో రాహుల్ వెంట టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పెద్ద సంఖ్యలో నాయకులు, వేలాది మంది కార్యకర్తలు ఉత్సాహంగా నడిచారు. విద్వేషం చోడో.. భారత్ జోడో నినాదాలతో పాదయాత్ర సాగింది. యాత్రలో రైతులు, మత్స్యకారులు, బీడీ కార్మికులు, రైతు సంఘాలకు భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు రాహుల్ గాంధీ. గురువారం పాదయాత్ర ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ప్రజలు ఇచ్చే ప్రోత్సాహం తనలో ఎంతో ఉత్సాహాన్ని నింపిందనీ, ప్రజల ప్రేమ ఇలాగే ఉంటే ఇంకా ఎంత దూరమైనా నడుస్తానని రాహుల్ పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ సర్కార్ల పాలనా తీరుపై విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్ అడ్డగోలుగా ఎమ్మెల్యేలను కొంటున్నాయని ఆరోపించారు. దేశంలోనే అత్యంత అవినీతి మయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మారిందన్నారు. టీఆర్ఎస్, బీజేపీలు నాణేనికి బొమ్మ బొరుసు లాంటివని అన్నారు. పార్లమెంట్ లో బీజేపీ తెచ్చిన బిల్లులకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీ రైతు వ్యతిరేక చట్టాలనూ టీఆర్ఎస్ సమర్ధించిందని అన్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల దేశానికి శాపంగా మారాయన్నారు. గ్యాస్ సిలెండర్ ధర పేదలకు భారిందని అన్నారు. గతంలో గ్యాస్ ధర రూ.400లు ఉన్న సమయంలో ప్రధాని మోడీ విమర్శలు చేశారనీ, ఇప్పుడు రూ.1100 లు దాటిందనీ దీనిపై మోడీ ఇప్పుడేమి చెబుతారని ప్రశ్నించారు.