RBI: తన ఆదేశాలు ధిక్కరిస్తున్న జాతీయ బ్యాంకులభరతం రిజర్వుబ్యాంకు పడుతోంది.నిబంధనలు ఉల్లంఘించినందుకు రెండ్రోజుల క్రితం బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కోటి రూపాయలు జరిమానా విధించిన విషయం తెలిసిందే.
ఇది ఇంకా మరుగున పడకముందే మరో జాతీయ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కూడా రిజర్వ్ బ్యాంక్ సోమవారం కోటి రూపాయల జరిమానా విధించింది.రిజర్వ్ బ్యాంక్ అవలంబిస్తున్న కఠిన వైఖరి జాతీయ బ్యాంకులకు వణుకు పుట్టిస్తోంది.
యూనియన్ బ్యాంక్ చేసిన తప్పిదాలివే!
మొండి బాకీలుగా పరిగణించదగ్గ బ్యాంకింగ్ కార్యకలాపాల వివరాలను ఎప్పటికప్పుడు తమకు పంపాలని రిజర్వు బ్యాంక్ 2016 లోనే అన్ని బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చింది.అలాగే ఆయా బ్యాంకుల్లో అక్రమంగా రుణాలు పొందిన వారి జాబితాను కూడా తయారు చేసి ఉంచాలని,అలా వారిపై నిఘా వేయడంతో పాటు క్రిమినల్ చర్యలకు కూడా బ్యాంకులు సిద్దంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలిచ్చింది.అయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటివేమీ పాటించలేదని,ఏ జాగ్రత్తలూ తీసుకోలేదని వార్షిక ఆడిట్లో తేలింది. బ్యాంకులను మోసగించే వాళ్లకు ఇది రెడ్ కార్పెట్ వేయడం వంటి చర్య అని రిజర్వు బ్యాంకు అభిప్రాయపడింది .దీన్ని తీవ్రంగా పరిగణించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సదరు బ్యాంకుకు కోటి రూపాయల జరిమానాను విధించింది.ఈ వ్యవహారంలో ఇంకా లోతుగా జరిపి అవసరమైతే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యున్నత అధికారులపై చర్యలకు కూడా రిజర్వు బ్యాంక్ సిద్ధంగా ఉన్నట్లు బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి.
ఇక ఎస్బీఐ కేసేమిటంటే?
కేవలం రెండు రోజుల క్రితమే రిజర్వ్ బ్యాంక్ ఎస్బీఐ కి కూడా కోటి రూపాయలు జరిమానా విధించడం సంచలనం రేపింది.సాధారణంగా ఎస్బీఐ జోలికి ఎవ్వరూ వెళ్లరు.ఆ బ్యాంకుకు ఉన్న నేమ్& ఫేమ్ అలాంటిది.కాని రిజర్వుబ్యాంక్ ఆ బ్యాంకు ని కూడా వదిలిపెట్టలేదు.అనేక కోణాల నుంచి దర్యాప్తు జరిపి అతిపెద్ద కుంభకోణం బయటపెట్టింది.రిజర్వ్ బ్యాంక్ నియమ నిబంధనలకు విరుద్ధంగా రుణగ్రహీతల కంపెనీలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు ఉన్న విషయం వెలుగుచూసింది.తద్వారా ఎస్బీఐ కూడా రుణగ్రహీతలతో కుమ్మక్కయినట్లు అభిప్రాయపడింది.ఇది చాలా తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణించిన రిజర్వ బ్యాంక్ ఎస్బీఐకి కోటి రూపాయల జరిమానా విధించింది.ఇలా వరుసగా ఆర్బీఐ జాతీయ బ్యాంకుల వెంట పడుతుండటంతో ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. ఎప్పుడు ఎవరి వంతు వస్తుందోనని భీతిల్లుతున్నాయి.