మొత్తం 40 మందితో ఏపీ బీజేపీ కొత్త కమిటీ ఏర్పాటైంది. సోము వీర్రాజు కొత్త టీమ్లో 10 మంది ఉపాధ్యక్షులు, 10 మంది కార్యదర్శులు, ఐదుగురు ప్రధాన కార్యదర్శులు ఉన్నారు.
కార్యవర్గం కూర్పుపై అప్పుడే అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న హార్డ్కోర్ నేతలను పక్కన బెట్టడంపై దుమారం రేగుతోంది. ప్రాంతాల మధ్య సమతుల్యం చూపించానని చెబుతున్న సోము వీర్రాజు అందుకు భిన్నంగా కమిటీని ఏర్పాటు చేశారని ప్రకాశం జిల్లా నుంచి ఒక్కరు కూడా కమిటీలో లేకపోవటం ఇందుకు నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . విషయం ఏమిటంటే ….బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదివారం నాడు ప్రకటించిన ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ కమిటీలో ప్రకాశం జిల్లాలో ఏ ఒక్కరికీ పదవి లభించకపోవడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది.
నిజానికి ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి బీజేపీ జాతీయ నాయకురాలు గా ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల అనంతరం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఈదర హరిబాబు వంటి వారు ఆ పార్టీలో చేరారు. మాజీ శాసనసభ్యులు కూడా అయిన హరిబాబు ప్రకాశం జిల్లాలో స్ట్రాంగ్ లీడర్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆయనకి కూడా అవకాశం కల్పించకపోవడం సమంజసంగా లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సోము వీర్రాజు టిడిపి నుండి తమ పార్టీలో చేరిన ఒక కేంద్ర మాజీ మంత్రి ని టార్గెట్ చేసి ఆయన వర్గీయులు ఎవరికీ పదవులు ఇవ్వకుండా చేశారు అన్నది ఒక కథనం.
ఈదర హరిబాబు ఆ మాజీ కేంద్రమంత్రి అనుచరుడు కావడం ఇక్కడ గమనార్హం. అలాగే సోము వీర్రాజు ఒక సామాజిక వర్గాన్ని కూడా దూరంగా పెడుతున్నారన్న టాక్ వుంది. అది కూడా హరిబాబు కి పదవి రాకపోవడానికి మరో కారణం అంటున్నారు. ఇంతకు ముందు ప్రకాశం జిల్లా నుండి బత్తిన నరసింహారావు ,బండారుపల్లి హేమంత్ కుమార్, గోలి నాగేశ్వరరావు తదితరులు రాష్ట్ర కార్యవర్గంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఒక్కరంటే ఒక్కరికి కూడా ప్రకాశం జిల్లా నేతలకు సోము వీర్రాజు పదవి ఇవ్వకపోవడం పట్ల పార్టీ వర్గాలే పెదవి విరుస్తున్నాయి.ఇదే విధానం అవలంబిస్తే ప్రకాశం జిల్లాలో బిజెపి బలోపేతం అయ్యేది కల అంటున్నారు.