టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న ఖమ్మం పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు తెలంగాణ మంత్రి హరీష్ రావు, ఇటు ఏపి ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణలు ఒకే తరహా విమర్శలు చంద్రబాబుపై సంధించారు. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చంద్రబాబు మళ్లీ బీజేపీ తో దోస్తీకి ప్రయత్నిస్తున్నారు అనేది బహిరంగ రహస్యమే. కానీ చంద్రబాబుకు బీజేపీ డోర్స్ క్లోజ్ చేసింది. ఏపీ బీజేపీ నేతలు పలు సందర్భాల్లో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. టీడీపీ పొత్తు ప్రసక్తేలేదని ఆ పార్టీ ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్శింహరావు తదితరులు అంటూనే ఉన్నారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తొంది. ఈ తరుణంలో తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధులను పోటీ పెట్టేందుకు చంద్రబాబు సిద్దం అవుతున్నారు. ఈ క్రమంలో నిన్న ఖమ్మం లో జరిగిన సభలో చంద్రబాబు పాల్గొన్నారు.
చంద్రబాబు ఖమ్మం పర్యటనపై తెలంగాణ మంత్రి హరీష్ రావు, ఏపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు వేరువేరుగా స్పందిస్తూ ఒకే రకంగా విమర్శలు చేశారు. బీజేపీకి దగ్గర అయ్యేందుకు చంద్రబాబు తాపత్రయ పడుతున్నారని సజ్జల విమర్శించారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టే చంద్రబాబు తెలంగాణ యాత్రలను ప్రారంభించారని చెప్పారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్దాంతాన్ని గతంలోనే ప్రజలు తిరస్కరించారని అన్నారు. చంద్రబాబుకు ఏ విషయంలోనూ క్లారిటీ లేదని విమర్శించారు.
చంద్రబాబు ఖమ్మంలో చేసిన షో ఎలా ఉంది అంటే కూట్లో రాయి తీయలేని వాడు ఏట్లో రాయి తీస్తానన్నట్లు ఉందని బీఆర్ఎస్ నేత, మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఏపిని అప్పులపాలు చేసి అభివృధ్ది చేయలేక, ప్రజల చీత్కారానికి గురై ఇప్పుడు తెలంగాణ ను అభివృద్ధి చేస్తానంటున్నాడని వ్యాఖ్యానించారు. ఏపి ప్రజలే చిత్తుచిత్తుగా ఓడించి వెళ్లగొడితే ఇక్కడికి వచ్చి ఏదో చేస్తానంటున్నాడని విమర్శించారు. తెలంగాణలో అన్ని వర్గాలకు తీరని అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబేనని మండిపడ్డారు. చంద్రబాబు అది చేశాను, ఇది చేశాను అంటూ ఏమైనా చెప్పగలరనీ, ఇవేళ తెల్లవారింది అంటే అది తన వల్లే అంటారనీ, పొద్దునే కూడి కూస్తొంది అంటే అదీ తన వల్లే అని చంద్రబాబు అంటారనీ, అది చంద్రబాబు స్టయిల్ అంటూ విమర్శించారు హరీష్ రావు.
2018 ఎన్నికలకు ముందు మహాకూటమి పేరిట చంద్రబాబు కుట్ర చేస్తే ప్రజలు ఏకమై ఆ కుట్రను చిత్తు చేశారని హరీష్ రావు అన్నారు. ఆంధ్రాలో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలన్న ఎత్తుగడతో తెలంగాణలోనూ తనకు టీడీపీకి బలం ఉందని నిరూపించుకోవాలని ఖమ్మం సరిహద్దులో సభ పెట్టుకుని పక్క రాష్ట్రం నుండి ప్రజలను తెచ్చుకున్నాడని విమర్శించారు. బీజేపీతో పొత్తు కోసం పాకులాడుతున్నాడు తప్ప దీని వల్ల తమ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని అన్నారు హరీష్ రావు. ఆంధ్రాలో చెల్లని రూపాయి తెలంగాణలో చెల్లుతుందా అని ప్రశ్నించారు. చంద్రబాబుది భస్మాసుర హస్తమనీ, గతంలో మహాకూటమి కడితే ఆయన దెబ్బకు ఆ కూటమే ఖతం అయిపోయిందని హరీష్ రావు వ్యాఖ్యానించారు.