అమరావతి: టిడిపి సీనియర్ నేత, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం తోట త్రిమూర్తులు భారీ సంఖ్యలో ఆయన అభిమానులు, కార్యకర్తలతో కలిసి వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంలో జగన్ వారికి పార్టీ కండువా కప్పిసాదరంగా ఆహ్వానించారు.
అనంతరం త్రిమూర్తులు మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గం, జిల్లా అభివృద్ధి కోసమే తాను వైసిపిలో చేరినట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్తోనే సాధ్యమంటూ ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలు సమర్థుడైన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని త్రిమూర్తులు పేర్కొన్నారు. పార్టీలో సీనియర్లతో కలిసి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని త్రిమూర్తులు అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయన ఎప్పుడు కాపుల గురించి మాట్లాడలేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో వైసిపి రాజ్యసభ్య సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.