వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి రాష్ట్రంలో అధికారం చేపట్టి వంద రోజులు దాటింది. ఈ సందర్భంగా జగన్ పాలనపై సమీక్షలు జరిగాయి. ప్రతిపక్షం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా కొత్త ప్రభుత్వం పాలనకు కితాబు ఇచ్చిన వారు లేరు. జగన్ పాలనపై ఇంత త్వరగా తీర్పు ఏం చెబుతాం, కొన్నాళ్లు ఆగుదాం అన్నవారు కూడా లేరు.
వైఎస్ జగన్ పాలనను కొన్నాళ్లు గమనిద్దాం, కొంత సమయం ఇచ్చి చూద్దాం అని మొదట అన్న నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి ప్రభుత్వంపై ఏకంగా యుద్ధం ప్రకటించింది.
వైఎస్ జగన్ పాలనను విమర్శించే విషయంలో టిడిపికి బిజెపి ఏమాత్రం తీసిపోవడం లేదు. ఆ మాటకొస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అన్న అతిశయంతో బిజెపి మాటలు కాస్త మీరుతున్నది కూడా. సిపిఐ ముందే పెదవి విరిచింది. సిపిఎం మాత్రం కాస్త వెనకాముందూ చూస్తున్నది. తాజాగా పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పదునైన విమర్శ చేసింది. జగన్ పాలనలోని లోపాలపై ఏకంగా పుస్తకమే వేసింది.
వంద రోజుల్లో జగన్ ప్రభుత్వం ఇంత వ్యతిరేకత ఎలా మూట కట్టుకోగలిగింది. పాలనా పగ్గాలు చేపట్టగానే వైసిపి నేతలు టిడిపిని బోనులో నిలబెట్టడం ఎలా అన్నదానిపై దృష్టి సారించారు. గత ప్రభుత్వం విపరీతమైన అవినీతికి పాల్పడిందని నిరూపించడం లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. పిపిఎల సమీక్ష, పోలవరం కాంట్రాక్టులు రద్దు, రాజధానిలో పనుల నిలిపివేత వరసగా జరిగిపోయాయి.
వీటికి సమాంతరంగా విజయగర్వంతో ఉన్న వైసిపి కార్యకర్తలు అక్కడక్కడా టిడిపి కార్యకర్తలపై కాలు దువ్వారు. ఈ దాడులకు వైసిపి నాయకత్వం పధక రచన చేసిందని అనలేం. కానీ ఒకసారి సంఘటన జరిగిన తర్వాత నాయకత్వం ఎవరి పక్షాన నిలబడుతుందో అందరికీ తెలుసు. దానికి తోడు పోలీసులు ఎక్కువ సందర్భాలలో అధికారపక్షం కొమ్ము కాశారు.
పోలవరం, రాజధాని వంటి ప్రధానమైన విషయాలపై ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తునే వైసిపిని బోనులో నిలబెట్టేందుకు ఇంకా ఏమి దొరుకుతాయా అని చూస్తున్న టిడిపి నాయకత్వానికి పల్నాడు పరిణామాలు కలిసివచ్చాయి. టిడిపి వ్యూహం పసికట్టలేకపోయిన వైసిపి ఆలస్యంగా మేలుకొనేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముఖ్యమంత్రి జగన్ ఎక్కువగా పట్టించుకునే జాతీయ మీడియా చలో ఆత్మకూరు రోజున అకస్మాత్తుగా ఆంధ్రప్రదేశ్పై దృష్టి సారించింది. టిడిపిపై నిర్బంధం కవరేజితో పాటు వంద రోజుల జగన్ పాలనను కూడా సునిశితంగా విశ్లేషించారు. జాతీయ మీడియాలో జగన్ పాలనపై ఇంత వ్యతిరేక ప్రచారం వస్తుందని ఊహించని వైసిపి పెద్దలు షాక్ తిన్నారు.
అధికారంలోకి రాగానే తాము అమలు చేయడం మొదలుపెట్టిన సంక్షేమ పధకాలే అన్ని విమర్శలకూ సమాధానం ఇస్తాయని భావించిన వైసిపి నాయకుల అంచనాలు తప్పాయి. ప్రతిపక్షాల విమర్శలకు ప్రతిగా ముప్పేట విమర్శల దాడి చేయడమే సరైన వ్యూహమని వైసిపి నేతలు భావిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా తాము ఎలా వ్యవహరించామో ప్రభుత్వంలో ఉండి కూడా అలానే వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు వంద రోజుల పాలనపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శకు అదే రోజున పవన్ సామాజిక వర్గమైన కాపు కులానికి చెందిన ఇద్దరు మంత్రులు, ఇద్దరు శాసనసభ్యులు సమాధానం ఇచ్చారు. వారిలో ఒకరు కాపు కార్పొరేషన్ ఛైర్మన్. మరుసటి రోజు మరో ఎమ్మెల్యే రోజా పవన్పై విరుచుకుపడ్డారు.
ఇది దేనిని సూచిస్తున్నది. 151 మంది శాసనసభ్యులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసిపి నిరంతరం ఆత్మరక్షణ వైఖరినే అవలంబిస్తున్న విషయాన్ని సూచిస్తున్నది. 23 మంది శాసనసభ్యులకు పరిమితమై ఘోర పరాజయం పాలయిన టిడిపి మూడు నెలల్లోనే ఉత్సాహాన్ని కూడగట్టుకుని ప్రభుత్వంపై దాడి చేయగలుగుతున్నది. దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో తెలియక వైసిపి నేతలు మాత్రం గందరగోళంలో పడిపోతున్నారు. అధికారం చేపట్టిన తర్వాత కూడా ప్రతిపక్షం మూడ్ నుంచి బయటపడలేకపోవడం దీనికి కారణం.
సురయ్యా