అమరావతి: టిడిపి అభ్యంతరాలను కూడా పరిశీలిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు కేంద్రాల్లో రీపోలింగ్ ప్రకటించడంపై పలువురు మంత్రులు, టిడిపి నేతలు శుక్రవారం సిఎస్ సుబ్రమణ్యంను కలిసి తమ నిరసన వ్యక్తం చేశారు. తమ ఫిర్యాదులను బుట్టదాఖలు చేసి వైసిపి అభ్యర్థి ఇచ్చిన ఫిర్యాదుపైనే ఏకపక్షంగా ఐదు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఈ సందర్భంగా టిడిపి అభ్యంతరాలపైనా పరిశీలన చేస్తామని సిఎస్ సుబ్రమణ్యం వారికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
నరసరావు పేట, రాజంపేట, రైల్వే కోడూరు, సత్యవేడు, జమ్మలమడుగు, సత్తెనపల్లి, చంద్రగిరి నియోజకవర్గాల్లోని 19 చోట్ల రీ-పోలింగ్ జరపాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు టిడిపి నేతలు తెలిపారు. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, నక్కా ఆనంద్ బాబు, జవహర్, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, బోండా ఉమామహేశ్వర రావు, ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న, బచ్చుల అర్జునుడు తదితరులు ఈ సందర్భంగా సిఎస్ సుబ్రమణ్యంకు వినతి పత్రం అందజేశారు.
ఇదే సమస్యపై టిడిపి అధినేత చంద్రబాబు నేతృత్వంలో టిడిపి నేతల బృందం నేటి సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి నిరసన తెలియజేయనున్నారు. ఇసిని కలిసేందుకు చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
రాష్ట్రంలో మూడు జిల్లాల్లో ఐదు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించిన తరువాత మళ్లీ ఇప్పడు మరో ఐదు కేంద్రాల్లో రీపోలింగ్కు ఇసి ఆదేశించడంపై టిడిపి అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. తమ అభ్యంతరాలు, ఫిర్యాదులు పట్టించుకోకుండా కేవలం వైసిపి నేతలు ఇచ్చిన ఫిర్యాదులపైనే స్పందిస్తున్నారంటూ టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.