రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు తెలంగాణ కేబినెట్ ఖరారు చేసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశంలో నామినేటెడ్ ఎమ్మెల్సీల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు.
మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, ప్రముఖ ప్రజా కవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను మంత్రివర్గం ఖరారు చేసింది. ఈ పేర్లను గవర్నర్ ఆమోదం కొరకు ప్రభుత్వం రాజ్భవన్కు పంపింది.
నామినేటెడ్ ఎమ్మెల్సీలు దివంగత నాయిని నర్శింహరెడ్డి, రాములు నాయక్, కర్నె ప్రభాకర్ పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టు నాటికే ముగిశాయి. అప్పటి నుండి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. నామినేటెడ్ ఎమ్మెల్సీ రేసులో పలువురు నేతల పేర్లు వినిపించినప్పటికీ ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయం మేరకు పై ముగ్గురి పేర్లను ఖరారు చేశారు. సామాజిక సమీకరణలను పాటిస్తూ ఎస్సీ, బీసీ, ఓసి వర్గాలకు చెందిన నాయకులకు అవకాశం కల్పించారు.