ఇది కలియుగ దైవం తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్ న్యూస్. శ్రీవారి సర్వదర్శనం టికెట్ల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21న సాయంత్రం 5 గంటల నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.
జనవరి 3 నుంచి తిరిగి టోకెన్ల జారీని ప్రారంభిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఈ నెల 24 నుంచి టీటీడీ జారీ చేయనున్న లక్ష ఎస్డీ టోకెన్లు కేవలం తిరుపతి ప్రజలకు మాత్రమే ఇవ్వనున్నారు అధికారులు. కోవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.తిరుపతిలో ఉన్న స్థానికుల కోసం ఐదు కౌంటర్లలో టికెట్లను ఇస్తున్నామని స్పష్టం చేశారు. రాజ్యాంగ బద్దమైన పదవుల్లో ఉన్న నేతలకు కుటుంబసభ్యులతో కలిపి ఐదుగురిని మాత్రమే అనుమతి ఇస్తున్నట్లుగా తెలిపారు.
పదవుల్లో లేని వీఐపీలకు మాత్రం వన్ ప్లస్ త్రీగా అనుమతి ఉంటుందని అన్నారు.కాగా సిఫార్సు లేఖలు ఇవ్వొద్దని ఈవో జవహర్రెడ్డి వీఐపీలకు విజ్ఞప్తి చేశారు. ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వైకుంట ఏకాదశి దర్శనాల్లో అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గాల్లో టికెట్ లేకుండా ఎవరినీ అనుమతించమన్నారు టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి. కోవిడ్ కారణంగా రోజుకు కేవలం 35వేల మందికి మాత్రమే దర్శనం ఉంటుందన్నారు. ఏకాదశి పర్వదినాల్లో సిఫార్సు లేఖలు చెల్లవన్న ధర్మారెడ్డి.. అలాంటి వారిని అలిపిరి దగ్గరే ఆపేస్తామన్నారు.
లాక్ డౌన్ తరవాత ఆలయాలు తిరిగి తెరుచుకోవడంతో భక్తులు పెద్దఎత్తున శ్రీవారిని దర్శించుకుంటున్నారు. కరోనా వ్యాపించకుండా, అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.వైకుంఠ ఏకాదశి నాడు ,నూతన సంవత్సరం ప్రారంభం రోజున తిరుమలేశుని దర్శించుకోవటం అనేది చాలామంది భక్తులకు సెంటిమెంటుగా కూడా ఉంటుంది.అయితే ఈసారి ఆ అవకాశం లేకపోవడంతో భక్తులు నిరాశ చెందుతున్నారు.