కృష్ణా జిల్లాలోని గుడివాడ, గన్నవరం పేర్లు చెపితే డేరింగో లేదా రెబల్ అనుకుంటారో కాని ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ పేర్లు మనకు గుర్తుకు వస్తాయి. వీరిద్దరి ప్రస్థానం తెలుగుదేశంతోనే స్టార్ట్ అయ్యింది. కొడాలి నాని ముందుగా గుడివాడ నుంచి రెండుసార్లు తెలుగుదేశం తరపున గెలిచి ఆ తర్వాత వైసీపీ నుంచి మరో రెండుసార్లు గెలిచారు. ఇక వంశీ 2009లో టీడీపీ తరపున బెజవాడ పార్లమెంటుకు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో లగడపాటి రాజ్గోపాల్ మీద ఓడిపోయారు.
ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో అంతటి వైసీపీ వేవ్లో కూడా వంశీ గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు మీద 830 ఓట్ల స్వల్ప తేడాతో గట్టెక్కారు. కట్ చేస్తే ఆ తర్వాత యేడాదిన్నరకే వంశీ టీడీపీతో విబేధించి వైసీపీ చెంతచేరిపోయారు. జగన్ దృష్టిలో పడేందుకో ఏమోగాని చంద్రబాబు, లోకేష్, టీడీపీ మీద తీవ్రమైన విమర్శలు చేశారు. వంశీ మాట్లాడిన మాటలకు చంద్రబాబే కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
అలా జగన్, వైసీపీ దృష్టిలో మంచి మార్కులు వేయించుకునే క్రమంలో వంశీ మరీ మితిమీరిన రాజకీయ వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలకు గురయ్యారు. కట్ చేస్తే ఇప్పుడు సాధారణ ఎన్నికల వేళ వంశీకి జగన్ షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గన్నవరంలో వంశీ ఈ సారి వైసీపీ నుంచి పోటీ చేస్తే అంత సానుకూల వాతావరణం లేదన్న నిర్ణయానికి జగన్ వచ్చేశారు. దీనికి తోడు అక్కడ వంశీకి వైసీపీ కీలక లీడర్లు, వైసీపీ కేడర్ నుంచి పెద్ద సపోర్ట్ లేదు.
ఎప్పుడో రెండు నెలల క్రిందటే ఈ సారి గన్నవరం వైసీపీ టిక్కెట్ తనకు రాదన్న సంకేతాలు రావడంతోనే వంశీ అప్పటి నుంచి సైలెంట్గానే ఉంటోన్న పరిస్థితి. అందుకే నియోజకవర్గానికి దూరంగా ఎక్కువుగా హైదరాబాద్లోనే గడుపుతూ వస్తున్నారు. ఇక ఇప్పుడు జగన్ వంశీని తప్పించేసి ఆ ప్లేస్లో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని పోటీ చేయిస్తారన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. గుడివాడలో నానికి ఈ సారి తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోందట.
ఈ క్రమంలోనే అక్కడ వైసీపీ తరపున రెండు, మూడు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సారి గుడివాడ టిక్కెట్ను జగన్ కాపు లేదా యాదవ కమ్యూనిటీల్లో ఎవరో ఒకరికి ఇస్తారని అంటున్నారు. ఒకవేళ కమ్మలకే ఇవ్వాలనుకుంటే నాని అనుచరుడు దుక్కిపాటి శశిభూషణ్ పేరు వినిపిస్తోంది. ఈ క్రమంలోనే నానికి అన్యాయం చేయకుండా పక్కనే ఉన్న గన్నవరం నుంచి బరిలోకి దింపేలా ఇప్పటికే రంగం సిద్ధమైందని తెలుస్తోంది.