ఏపీలో అధికార వైసిపి గత ఎన్నికలలో 50%కు పైగా ఓట్లతో పాటు ఏకంగా 151 సీట్లు సాధించి అప్రతిహత విజయంతో అధికారంలోకి వచ్చింది. అలాగే 25 పార్లమెంటు స్థానాలలో ఏకంగా 22 పార్లమెంటు సీట్లు గెలిచింది. ఇప్పుడు వైసీపీ అధినాయకత్వం వై నాట్ 175 అన్న నినాదంతో ఎన్నికలకు వెళుతుంది. అలాగే 25 కు 25 ఎంపీ సీట్లు విజయం సాధించి తీరుతామని గట్టిగా చెబుతోంది.. ఇంత ధీమా వ్యూహం ఏమిటి అన్నది చాలామందికి అంతు పట్టటం లేదు.
ఒకసారి 2019 ఎన్నికల నుంచి వైసీపీ విజయాలు.. ఓట్ల గణాంకాలు చూస్తే ఈ ఐదేళ్లలో మరింత బలపడింది అని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. 2019 ఎన్నికలలో దాదాపు 50% దాకా ఓటు షేర్ వైసిపికి వస్తే ఈ ఐదు సంవత్సరాలలో అది 5 నుంచి 10% పెరిగింది అని చెప్తున్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలలో.. ఇతర ఉప ఎన్నికలలో తమ పార్టీకి 2019 సాధారణ ఎన్నికల కంటే మరింతగా ఓటింగ్ శాతం పెరిగిందని చెబుతున్నారు. తమ పార్టీకి 60 శాతం ఓటు షేర్ ఎన్నికలలో వస్తుంది అని వైసిపి వాళ్ళు చెబుతున్నారు. అలాంటప్పుడు ఎన్ని పార్టీలు వచ్చినా.. ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్న జరిగే పని కాదు అని అంటున్నారు.
ఏపీలో టీడీపీకి గతసారి 40% ఓటు షేర్ వచ్చింది. అలాగే జనసేనకు ఆరు శాతం చేరు వచ్చింది. ఈ రెండు పార్టీలు కలిస్తే 46% షేర్ ఉంటుంది. ప్రభుత్వం వ్యతిరేకత ఉంటుంది అన్నది టిడిపి నాయకులు చెబుతున్న మాట.. అందుకే ఈసారి తమ కూటమికి 50% కు పైగా ఓటింగ్ ఉంటుంది అని వాళ్ళు చెప్తున్నారు. అయితే వైసిపి లెక్కలు మరోలా ఉన్నాయి. తమకు పాజిటివ్ వేవ్ ఉంది కాబట్టి మరో శాతం ఓటు పెరిగి మొత్తం 60 శాతం ఓట్లు తమకు వస్తాయని చెబుతున్నారు.
టిడిపికి గత ఎన్నికలలో 40% ఓట్లు వస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేసరికి అది 34% లోపల ఉందని… ఈసారి కూటమి ఓటు షేర్ 40 శాతాన్ని మించి ఉండదు అని వైసిపి వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు. అంటే పడే ప్రతి 10 ఓట్లలో ఆరు వైసీపీకి పడితే నాలుగు టీడీపీ కూటమికే పడతాయి అన్నది వైసిపి వాళ్ళు వేసుకుంటున్న లెక్కలు. మరి ఈ ఎన్నికలలో వైసిపి వాళ్ల లెక్కలు నిజం అవుతాయా లేదా కూటమి లెక్కలు గెలుస్తాయా అన్నది చూడాలి.