YCP MLA: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను అవమానించేలా గుంటూరు జిల్లా తాడికొండ వైసీఎం ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చేసిన వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు టీడీపీ నేతలు, అంబేద్కరిస్టుల నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీదేవి దీనిపై స్పందించి మీడియాకు వివరణ ఇచ్చారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ను తాను దూషించలేదని అన్నారు కావాలనే కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మార్ఫింగ్, ఏడిటింగ్ చేసిన వీడియో వల్ల అంబేద్కర్ వాదుల మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. తాను ఈ స్థాయిలో నిలవడానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలాలే తోడ్పాటునిచ్చాయని పేర్కొన్నారు.
YCP MLA: అంబేద్కర్, బాబూ జగజ్జీవన్ రామ్ ఇద్దరూ దళితులకు రెండు కళ్లలాంటి వాళ్లు
అంబేద్కర్, బాబూ జగజ్జీవన్ రామ్ ఇద్దరూ దళితులకు రెండు కళ్లలాంటి వాళ్లని అన్నారు. వీడియో ఎడిటింగ్ చేసి తప్పుడు ప్రచారం చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ కుట్ర వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదని ఎమ్మెల్యే శ్రీదేవి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో గురువారం జరిగిన 4వ ప్రపంచ మాదిగ దినోత్సవం కార్యక్రమంలో ఆమె బాబూ జగజ్జీవన్ రామ్ ను కీర్తిస్తూ చేసిన ప్రసంగం వీడియో ఒక సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. అందులో “అంబేద్కర్ ద్వారా హక్కులు వచ్చాయా ? రాలేదు. రాజ్యాంగ హక్కులను జగజ్జీవన్ రామ్ మనకు అమలు చేశారు. ఈ రోజున రాజకీయంగా, సామాజికంగా ఎదుగుతున్నామంటే అది జగజ్జీవన్ రామ్ ఘనతే, నేను ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా” అన్నట్లుగా వీడియో ఉంది. దీనిపై పలువురు టీడీపీ నేతలు, అంబేద్కరిస్టులు స్పందించి అంబేద్కర్ ను అవమానించినట్లుగా మాట్లాడిన శ్రీదేవి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.