వైసిపి అగ్రనేత విజయసాయి రెడ్డిపై ముఖ్యమంత్రి పార్టీ అధినేత జగన్ ఒక బృహత్తర బాధ్యతను ఉంచారు.దీన్ని మోయడ౦ విజయసాయిరెడ్డి కేమీ చిన్న విషయం మాత్రం కాదు.
జగన్ ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా మార్చాలనుకుంటున్న విశాఖపట్నంలో ఒక్క సెంటు భూమి కూడా అన్యాక్రాంతానికి గురికాకుండా చూడడం అనేది విజయసాయిరెడ్డి చేయాల్సిన పనట.వైసిపి ప్రభుత్వమే అధికారం లో ఉండగా ఇదేమీ పెద్ద విషయం కాదని ఎవరన్నా అనుకుంటే పొరపాటే .భూ కబ్జాలు భూ దందాలతో విశాఖపట్నం దద్దరిల్లుతోంది!పెద్ద పెద్ద వాళ్లే ఇందులో ఉన్నారు.విశాఖలో గత అయిదేళ్ళలో భూదందా పక్కా లెక్కన జరిగింది అన్నది తెలిసిందే. ఆనాడు ప్రభుత్వ భూములనే వేలల్లో ఆక్రమించారని ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు, పేదల భూములు, అసైన్డ్ లాండ్స్,దళితుల భూములు కూడా దందాలో మొత్తానికి కొట్టుకుపోయాయి.ఇక ఇప్పుడు పరిపాలనా రాజధాని అని జగన్ ప్రకటించారు. దాంతో విశాఖలో ఒక్కసారిగా భూముల ధర లకు రెక్కలు వచ్చాయి.
దానికి తోడు విశాఖలో భూముల కొరత కూడా ఉంది. ప్రభుత్వ భూములను చాలా కాలం క్రితమే చెరపట్టేశారు. మిగిలి ఉన్న అతి తక్కువ భూములలో కూడా ఇపుడు దందా జరుగుతోంది. దీంతో వైసీపీ సర్కార్ చాలా సీరియస్ గా భూ ఆక్రమణల మీద దృష్టి పెట్టిందని అంటున్నారు. రాజధాని కనుక వస్తే కచ్చితంగా ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున కావాల్సిఉంటుంది..వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఇపుడు వైసీపీ పెద్దలు తాము చిత్తశుద్ధితో ఈ విషయంలో పనిచేస్తామని చెబుతున్నారు. జగన్ మొత్తం విశాఖ బాధ్యతను ఎంపీ విజయసాయిరెడ్డికి అప్పగించారు. ఆయన విశాఖలో దురాక్రమణకు గురి అయిన భూములను తిరిగి ప్రభుత్వం ఖాతాలోకి వచ్చేలా చూస్తామని చెబుతున్నారు.
కబ్జాకు పాల్పడిన వారు తమ పార్టీలో ఉన్నా కూడా చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరిస్తున్నారు.ఇందుకోసం ప్రత్యకంగా లీగల్ సెల్ ని కూడా ఓపెన్ చేసి పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున కూడా వాదించి మరీ భూ దందాలకు గురి అయిన భూములను వెనక్కు తీసుకుంటామని చెబుతున్నారు. అయితే విజయసాయిరెడ్డి అనుచరులే ఈ భూదందాలకు పాల్పడుతున్నారని టిడిపి ఎప్పటికప్పుడు ఆరోపణలు చేస్తోంది.దొంగ చేతికే తాళాలు ఇచ్చారని కూడా వ్యాఖ్యలు వినవస్తున్నాయి.ఒకవైపు ముఖ్యమంత్రి తనపై పెట్టిన నమ్మకాన్ని కాపాడుకోవటం …మరోవైపు ప్రతిపక్షాల ఆరోపణలకు దీటుగా సమాధానం ఇవ్వడం వంటివి విజయసాయిరెడ్డి చేయాల్సి ఉంటుంది ఇది ఒకరకంగా ఆయనకు అగ్ని పరీక్షే!