హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, శ్రీ విద్యా నికేతన్ విద్యా సంస్థల అధినేత మంచు మోహన్ బాబు వైసిపిలో చేరారు. లోటస్పాండ్లోని జగన్ నివాసంలో మోహన్ బాబు వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. వైసిపి అధినేత జగన్ మోహన్బాబుకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
పదవులు ఆశించి గానీ, బంధువని గానీ వైసిపిలో చేరలేదని ఈ సందర్భంగా మోహన్ బాబు తెలియజేసారు. ప్రజలకు మంచి చేస్తాడనే నమ్మకంతోనే పార్టీలో చేరానని మోహన్ బాబు పేర్కొన్నారు.
వైసిపిలో చేరాల్సిందిగా మూడేళ్ల క్రితమే జగన్ తనను ఆహ్వానించారని మోహన్ బాబు తెలిపారు. ఎమ్మెల్యేనో, ఎంపీనో అవ్వాలనుకుంటే అప్పుడే పార్టీలో చేరేవాడినని మోహన్ బాబు అన్నారు.
ఎన్టీఆర్ మరణం తర్వాత తాను ఏ పార్టీలోనూ చేరలేదనీ, బిజెపికి మాత్రం ఒక సందర్భంలో మద్దతు ఇచ్చానని మోహన్ బాబు చెప్పారు. ఎన్నికల్లో వైసిపి తరఫున ప్రచారం చేస్తానని మోహన్బాబు స్పష్టం చేశారు.