విజయవాడ, ఏప్రిల్ 7: ప్రశ్నించే వాడికి కులం అంటగడుతున్నారని సినీనటుడు శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కొందరు కులాజీ అని ముద్ర వేశారని శివాజీ అన్నారు. విజయవాడలో ఆయన ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘నిజం విత్ శివాజీ’ పేరిట రాజధాని, పోలవరం తదితర అంశాలపై కొన్ని వీడియోలను ప్రదర్శించారు. తన దృష్టికి వచ్చిన అంశాలను మాత్రమే వివరిస్తున్నానని శివాజీ పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టు ఆపేందుకు కుట్రలు జరుగుతున్నాయని శివాజీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిక్షణం ప్రయత్నిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్తో జగన్ ఎందుకు స్నేహం చేస్తున్నాడో అర్థం కావడం లేదని శివాజీ అన్నారు. కెసిఆర్పై శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కెసిఆర్తో స్నేహం పులి మీద స్వారీ లాంటిదేనని శివాజీ హెచ్చరించారు. జగన్తో తనకు వ్యక్తిగత వైరం ఏమీలేదనీ, తన పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమేనని శివాజీ పేర్కొన్నారు.
రాష్ట్రంలో సరైన వ్యక్తి అధికారంలోకి రాకుంటే పోలవరం ప్రాజెక్టును తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆపేస్తారని ఆరోపించారు. ఎంపి కవిత ఒక సందర్భంలో పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటామంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియాను ప్రదర్శించారు. జగన్పై కెసిఆర్కు నిజంగా ప్రేమ ఉందని తాను అనుకోనని, ఆయన ఆడుతున్న పన్నాగంలో చిక్కుకోవద్దని జగన్కు శివాజీ హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టు ఆగిపోవడంతో పాటు రాజధాని కూడా తరలిపోయే ప్రమాదం ఉందని శివాజీ అన్నారు.
పక్క రాష్ట్రంలోని కొంత మంది ఆంధ్రప్రదేశ్పై పగబట్టారనీ వారి ఎత్తులు చిత్తు చేయాలని శివాజీ పిలుపు ఇచ్చారు. జగన్, కెసిఆర్లపై విమర్శలు చేసిన శివాజీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రజాశాంతి పార్టీ అధినేత కెఎ పాల్లను సమర్థించారు. పవన్ ఎక్కడ తప్పు జరిగినా ప్రశ్నించే మనస్తత్వం కల్గిన వ్యక్తి అని కొనియాడారు. కెఎ పాల్ నిజమైన క్రైస్తవుడు అని కితాబు ఇస్తూ ఆయనకు వాక్శుద్ధి ఉందని శివాజీ అన్నారు. ఆయన్ను కామిడీ ఐటమ్గా చూడవద్దని శివాజీ సూచించారు.
పోలవరం పనులు, అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు.