అతి అనర్ధం సుమతి అని పెద్దలు అన్నట్లు అమరావతి రైతులపై పోలీసులు చేస్తున్న అతి ఉద్యమానికి ఊపిరి పోస్తోంది. పెద్ద బాస్ ల దగ్గర మార్కులు కొట్టేయాలని పోలీసులు చేస్తున్న పనులు అసలుకే ఎసరు తెస్తున్నాయి. ఇటు పోలీసుల ఉద్యోగాలు ఉడేవరకు వెళ్తున్నాయి.
అమరావతి ప్రాంత పరిధిలోని కృష్ణాయపాలెంలో మంగళవారం మూడు రాజధానులు మద్దతుగా కార్యక్రమం చేసేందుకు వెళ్తున్న కొందరిని అమరావతి మద్దతుగా పోరాటం చేస్తున్న రైతులు అడ్డుకున్నారు. అక్కడ ఇరు పక్షాల మధ్య వాగ్వివాదం తోపులాట జరిగింది. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి అమరావతి రైతుల మీద ఎస్సి ఎస్టీ కేసు పెట్టడమే కాదు. వారిని కోర్టు ముందు హాజరు పరిచేందుకు ఏకంగా బేడీలు వేసి తీసుకువెళ్లడం పెద్ద రభసకు దారి తీసింది. సెక్షన్ 322 లేదా 323 లాంటి స్టేషన్ బెయిల్తో అయిపోయే కేసులను కోర్టు వరకు తీస్కుని వెళ్లడమే తలనొప్పి అంటే, కోర్టు ముందుకు తీసుకువెళ్లే సమయంలో వారికీ బేడీలు వేయడం కోర్టు సైతం మొట్టికాయలు వేయడం పోలీసుల తీరుని ప్రశ్నించడమే కాదు.. ప్రతిపక్షానికి ఒక అవకాశం ఇచ్చినట్లు అయ్యింది. పొలిసు అధికారుల ఆగ్రహానికి కింది స్థాయి సిబ్బంది బలయ్యారు. ఏకంగా ఆరుగురు కోర్టు హెడ్ కానిస్టేబుళ్లను ఎస్పీ విశాల్ గున్ని బుధవారం సస్పెండ్ చేసారు.
అస్సోమ్ ప్రభుత్వ కేసులో
2019 లో అస్సోమ్ ప్రభుత్వానికి 1995 పీపుల్ డెమోక్రసీ అంశాల విషయంలో జరిగిన వాదనల్లో దేశ అత్యున్నన్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు నిందితులకు, అండర్ ట్రయిల్ ఖైదీలకు బేడీలు వేయవద్దని సూచించింది. అంతే కాదు నిందితులుగా కేసుల్లో ఉన్నవారి చిత్రాలను, వారి రూపం తెలిసేలా కనిపించేలా మీడియా ముందు ప్రవేశ పెట్ట వద్దని సూచించింది. వీటిని అమలు చేయడంలో రాష్ట్ర పోలీసులు మెతక వైఖరి అవలంబిస్తున్నారు. అందులోను స్టేషన్ బెయిల్ కేసులను డైరెక్ట్ గా కోర్టుకు తీసుకురాకుండా ఒత్తిడి తగ్గించాలని పోలీసులకు సూచిస్తున్న క్షేత్రస్థాయిలో దాన్ని పాటించడం లేదు.
చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ?
అక్కరకు వచ్చే చట్టాలను ఇష్టానుసారం వాడితే అవసరం వచ్చినపుడు అవి వృధా అవుతాయి. ఎస్సి ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పోలీసులే ఎలా నిర్వీర్యం చేస్తున్నారో ఈ కేసులో బహిర్గతం అయ్యింది. నిందితులు కాస్ట్ తెలుసుకోకుండానే వారిపై ఎస్సి ఎస్టీ అత్యాచార నిరోధకం చట్టం వంటి కేసు నమోదు చేయడం, బాధితుడిగా ఎఫ్ ఐ ఆర్ లో ఉన్న వ్యక్తి కేసు వద్దు అన్న పోలీసుల అతి ఏమిటో అర్ధం కానీ పరిస్థితి. ఒక ఎస్సి మీద మరో ఎస్సి ఫిర్యాదు చేస్తే కేసు చెల్లదు అనే ప్రాధమిక సూత్రం మరిచిపోయి ఇష్టానుసారం కేసులు నమోదు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఉన్నతాధికారులు గుర్తించాలి. అనంతరం బేడీలు వేసి వారిని తీస్కుని వెళ్లాలని చెప్పిన వారిని చట్టం ముందు నిలబెడితేనే పోలీసుల పోయిన పరువులో కాస్త అయినా కాపాడుకోగలరు. బాధితులను కాపాడి నిందితులను జాగ్రత్తగా కోర్టు ముందు నిలబెట్టాల్సిన బాధ్యత ఉన్న పోలీసులు నానా హడావుడి చేసి వారిని వారు దిగజార్చుకోవడమే కాదు ప్రభుత్వానికి లేని పోనీ తలవంపులు తెస్తున్నారు. అమరావతి రైతులకు ఉద్యమానికి పరోక్ష మేళ్లు చేస్తున్నారు.