ఢిల్లీ, జనవరి 7: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు తెలంగాణాలో మాదిరిగానే బుద్ధి చెప్పేందుకు ఆంధ్రులు సిద్ధంగా ఉన్నారని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సోమవారం పార్లమెంట్ బయట మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కోసం టిడిపి ఎంపిలు చేస్తున్న నిరసనలను డ్రామాలుగా అభివర్ణించారు.
ప్రత్యేక హోదాకు బదులుగా ప్యాకేజికి అంగీకరిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీతో టిడిపి జత కట్టడాన్ని తిరస్కరించారని ఆయన పేర్కొన్నారు. ఎపిలో దుష్ట కూటమికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనీ, రానున్న ఎన్నికల్లో టిడిపికి ఎదురు దెబ్బతప్పదనీ ఆయన అన్నారు. కొత్త రైల్వేజోన్ ఏర్పాటు విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట తెలుగుదేశం ఎంపీలు ఎపికి ప్రత్యేక హోదా, విభజన హామీలను నెరవేర్చాలని కోరుతూ రోజూ లాగానే ఆందోళన చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంపి శివప్రసాద్ ఎమ్జి రామచంద్రన్ వేషధారణతో కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శించారు.
previous post