Mamata Banerjee: మమతా బెనర్జీ Mamata Banerjee ఈ పేరు వింటేనే బెంగాల్ రాజకీయ బెబ్బులి అనే మాట వస్తుంది. మహిళ తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు.. అని నిరూపించిన వారిలో మమత ఒకరు. దశాబ్దాలుగా నాటుకుపోయిన వామపక్షాల కోటల్ని పదేళ్ల క్రితం ఆమె బద్దలకొట్టిన తీరుకు దేశం మొత్తం ఆశ్చర్యపోయంది. కాంగ్రెస్, వామపక్షాలతో నిండిపోయిన బెంగాల్లో ప్రాంతీయ పార్టీ బలమేంటో చూపించారు. సింగూర్ భూసేకరణలో రైతులకు మద్దతుగా చేపట్టిన దీక్ష, నందిగ్రామ్లో పోలీసుల కాల్పుల్లో బాధితుల కోసం చేసిన పోరాటం ఆమెను భవిష్యత్ బెంగాల్ సారధిని చేశాయి. 2011లో ఆమె బెంగాల్ సీఎం అయ్యారు.
కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి తృణమూల్ కాంగ్రెస్ ను స్థాపించారు. 13 ఏళ్లకే బెంగాల్లో వామపక్షాల పునాదులు కూల్చేసి సీఎం అయ్యారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆమె చేసిన పోరాటం, బెంగాలీల కోసం ఏదో చేయాలనే ఆమె తపన, పరిస్థితులకు వెరవని ఆమె ధీరత్వం, ఎదురెంతటి వారున్నా పోరాడే తీరు.. బెంగాలీలకు ఆమెను ఆశాదీపంలా మార్చేశాయి. 2011లో సీఎం అయితే.. 2016లో మరింత ధీటుగా ప్రజల మనసుల్ని గెలిచి మలిసారి సీఎం అయ్యారు. దేశం మొత్తాన్ని గడగడలాడిస్తున్న నరేంద్ర మోదీ, అమిత్ షాలను.. కొన్నేళ్లుగా ఆమె ఢీకొంటున్న తీరే ఇందుకు నిదర్శనం. బెంగాల్లో ఒకప్పుడు వామపక్షాల ఆధిపత్యాన్ని కూల్చేయాలని మమత ఎలా తాపత్రయపడ్డారో.. నేడు మమత ఆధిపత్యం నుంచి బెంగాల్ ను తమ వశం చేసుకోవాలనేది బీజేపీ ఆలోచన.
అయితే.. నాడు వామపక్షాలపై మమత ఒంటరి పోరు .. నేడు మమతపై బీజేపీ వ్యవస్థ మొత్తం పోరు. ఇన్నాళ్లూ మమతకు బలంగా ఉన్న ముకుల్ రాయ్, శుభేందు అధికారి ఇప్పుడు ఆమె పక్కన లేరు. అయినా.. ఆమెలో ధీరత్వం సడలలేదు. నేడు మమత పోటీ చేస్తున్న నందిగ్రామ్ లో ఎన్నిక జరుగుతోంది. శుభేందు నియోజకవర్గం అది. అయినా.. ఆమె అక్కడినుంచే పోటీ చేసి శుబేంధును అక్కడే ఓడించి తానేంటో నిరూపించాలని ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్లూ మమతను పక్కనే ఉండి చూసిన శుభేందు ఆమెను తక్కువ అంచనా వేస్తారనుకోవడం పొరపాటే. శుభేందుకి అక్కడ పట్టుందని తెలిసినా నందిగ్రామ్ నుంచే పోటీ చేయడం.. ముందుచూపుతో మరో నియోజకవర్గంలో పోటీకి వెళ్లకపోవడమే.. ‘మమతా బెనర్జీ’. మరి బెంగాలీల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?