అమరావతి : రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని బిజెపి ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మరో సారి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బీజేపీ పోరాటం ఉంటుందని చెప్పారు.
రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమనీ, రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా రాజధాని పెట్టుకోవచ్చనీ జీవీఎల్ పునరుద్గాటించారు. ఈ విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పినా తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని జీవీఎల్ వ్యాఖ్యానించారు. రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రం అడ్డుకుంటోందని కొందరు భ్రమలు కల్పిస్తున్నారని అన్నారు. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్ర పరిధిలో ఉన్న వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోదని తాము స్పష్టంగా చెబుతున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్లో రాజధాని అంశంపై కేంద్రం తొలిసారిగా స్పందించింది. రాజధాని ఏర్పాటు అంశం రాష్ట్రాల పరిధిలోదేనని, ఈ విషయంలో రాష్ట్రాలదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. ఈ మేరకు లోక్సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే.