హైదరాబాదు, మే 1: ఇంటర్ ఫలితాలలో కేవలం అపోహలు, గందరగోళం సష్టించేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని టిఆర్ఎస్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ఇంటర్ ఫలితాల అంశాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మంగళవారం టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్పై విమర్శలు చేయడాన్ని బాల్క సుమన్ తీవ్రంగా ఖండించారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి 24గంటల్లో కెటిఆర్కు క్షమాపణ చెప్పాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు.
సున్నితమైన అంశం అని కూడా చూడకుండా ప్రతిపక్షాలు విద్యార్థుల్లో ఆందోళన రేకెత్తించాయని సుమన్ అన్నారు. ‘రేవంత్ రెడ్డి రాజకీయ ఒక టెర్రరిస్ట్, నాలుగు కోట్ల టెండర్కు వేల కోట్ల కుంభకోణం అని మాట్లాడతాడు నోట్ల కట్టలతో దొరికిన దొంగ, రేవంత్ను ఎర్రగడ్డ మెంటల్ దవాఖానలో చేర్చాలి’ అంటూ బాల్క సుమన్ దుయ్యబట్టారు.
హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ మార్చిన కెసిఆర్ గురించి మాట్లాడే అర్హత రేవంత్కు లేదని బాల్క సుమన్ అన్నారు.
2017లో 4కోట్ల 30లక్షల 75వేలకు గ్లోబరీన సంస్థకు విద్యాశాఖ టెండర్ ద్వారా ఫైనల్ చేస్తే, గ్లోబరీనకు ఐటి శాఖకు సంబంధం ఏమిటని సుమన్ ప్రశ్నించారు. ఆనాడు ఐటి శాఖ మంత్రిగా కెటిఆర్ ఉన్నంత మాత్రాన విద్యాశాఖకు, ఐటి శాఖకు లింక్ ఏలా పెడతారని సుమన్ అన్నారు.
‘ఇంటర్ ఫలితాల్లో కొంత టెక్నికల్ సమస్య వచ్చింది నిజమే. ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కారం చూపేందుకు కృషి చేస్తుంది’ అని సుమన్ తెలిపారు. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా పని చేయడం లేదని సుమన్ విమర్శించారు. ఇంటర్ బోర్డులో కొంత మంది అధికారుల మధ్య విభేదాల కారణంగా గందరగోళం జరిగినట్లు తెలుస్తోందని సుమన్ అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పట్టుదలతో ఉన్నారని సుమన్ చెప్పారు. ఇంటర్ బోర్డు వ్యవహారంపై ప్రతి రోజు ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షలు జరుపుతున్నారని సుమన్ పేర్కొన్నారు.
ప్రతిపక్షాల ట్రాప్లో తల్లిదండ్రులు పడవద్దని సుమన్ హితవు పలికారు. ప్రతిపక్షాలు ప్రజల కోసం కాదు, వాళ్ల కోసం ఆందోళనలు చేస్తున్నారని సుమన్ విమర్శించారు.
కాంగ్రెస్ హయాంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్శింహ హయాంలోనే గ్లోబరీనా, మాగ్నేటిక్ సంస్థలు మనుగడలో ఉన్నాయనీ, ఈ రెండు సంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వం పోషించినవేనని సుమన్ పేర్కొన్నారు.