అమరావతి : ఏపీలో అధికార పార్టీ ఎంపీ రఘు రామకృష్ణంరాజు అసమ్మతి రాగం ఆ పార్టీ నేతలకు మేలు చేసినట్లు అయింది. రాజు గారి అసమ్మతి ఏమిటి.. ఆ పార్టీ నాయకులకు మేలు చేయడం ఏమిటని అనుకుంటున్నారా? అవును.. అక్షరాలా నిజం. అది ఏమిటంటే… వైకాపాకు చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అసమ్మతి రాగం ఎత్తుకున్న విషయం తెలిసిందే కదా.
పార్టీ అధినేత, ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఉందని, ఎవరికి అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదని అయన మీడియా ముఖంగానే వెల్లడించిన విషయం తెలిసిందే. రఘు రామ కృష్ణం రాజు ఆరోపణలను పలువురు వైకాపా నేతలు ఖండించినప్పటికీ.. సీఎం జగన్ అపాయింట్మెంట్ ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర నేతలకు లభించడం లేదని ఆ పార్టీ ప్రజా ప్రతినిధుల్లో ఉంది. వైకాపాకు 28మంది ఎంపీలు, 151మంది ఎమ్మెల్యేలతో పాటు ఇతర పదవుల్లో ఉన్న వారు పెద్ద సంఖ్యలో ఉండటంతో సీఎం జగన్ వారికి ఎప్పుడు పడితే అప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వడం కష్టమేమరి.
సీఎం జగన్ కూడా అవసరం లేకుండా ఎవరినీ కలుసుకోరు. దీనితో ఏడాది కాలంలో సీఎం వైఎస్ జగన్ ను వంద మందికి పైగా ఎమ్మెల్యేలు కలవలేక పోయారని అంటున్నారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులుగా పనులు చక్కబడుతున్నందున ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా లేరన్న మాట వినిపిస్తుంది. అయితే సీఎం జగన్ ను కలవలేక పోతున్నామన్న భావన వారిలో ఉందంట. ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణం రాజు మూలంగా ఈ విషయంపై కొంత రచ్చ జరగడంతో సీఎం జగన్ తన మనసు మార్చుకున్నట్లుగా తెలుస్తోంది.
సీఎం జగన్ గత రెండు మూడు రోజులుగా ఎంపీ, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లు ఇస్తున్నారని సమాచారం. డిప్యూటీ సిఎం పుష్ప శ్రీవాణి, ఎమ్మెల్యేలు సాయి ప్రసాద్ రెడ్డి, బాల నాగిరెడ్డి, కోలగట్ల వీరభద్రస్వామి తదితరులకు జగన్ అపాయింట్మెంట్ లు ఇచ్చారు. వారు చెప్పిన సమస్యలపై సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. ఇదే మాదిరిగా రోజుకు కొందరు ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు జగన్ అపాయింట్మెంట్ లు ఇస్తున్నారని చెబుతున్నారు. దీనితో సిఎం జగన్ ను నేరుగా కలుసుకొని తమ నియోజకవర్గాలలోని ప్రధాన సమస్యలు విన్నవించి వాటి పరిష్కారం కోసం హామీ పొందాలని భావిస్తున్న ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేస్తున్నారట. వాస్తవానికి సీఎం జగన్ త్వరలో చేపట్టనున్న రచ్చబండ కార్యక్రమం నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇవ్వాలన్న ఉద్దేశంలో ఉన్నారట. అయితే ముందుగానే ఎంపీ, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు లభిస్తుండటంతో రాజు గారు చేసిన రచ్చ ఒక కారణం అయి ఉండవచ్చని కూడా అనుకుంటున్నారు.