అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి తెర పడింది. 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది.
ఈ నెల 11 న పోలింగ్ జరగనున్నది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది. అరకు, పాడేరు, రంపచోడవరంలో మాత్రం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
రాష్ట్రంలో మొత్తం 3,93,45000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 10లక్షల మంది యువత తొలిసారిగా తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 56 వేల మంది పైచిలుకు
సర్వీస్ ఓటర్లు,నాలుగు లక్షల మంది వరకు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాల్లో 2,118 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 25 లోక్సభ నియోజకవర్గాల బరిలో 319 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు జిల్లాలో ప్రచారం ముగిస్తే, వైసీపీ అధ్యక్షుడు జగన్ తిరుపతిలో తమ ప్రచారాన్ని ముగించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరంలో తన ఎన్నిక ప్రచారాన్ని ముగించారు.