ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రముఖ నటుడు మోహన్ బాబు మద్య గ్యాప్ పెరిగిందా?, సీఎం జగన్ పై అయన అసంతృప్తిగా ఉన్నారా?, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన రాజకీయాల నుండి దూరంగా ఎందుకు ఉంటున్నారు? అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశమవుతున్నది.
2019 ఎన్నికల ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎంతో మంది సినీ నటులు మద్దతు తెలిపారు. కొంత మంది ఎన్నికల ప్రచారం కూడా చేశారు. తెలుగుదేశం ఆవిర్భావం నుండి ఆ పార్టీలో పనిచేసిన ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు..చంద్రబాబుపై వ్యతిరేకత, వైఎస్ జగన్ పై అభిమానం, ప్రేమతో ఎన్నికల ముందు వైసీపీ కండువా కప్పుకున్నారు. రాష్ట్రంలో వైసీపీ విజయానికి తన వంతుగా విస్తృత ప్రచారం కూడా చేశారు మోహన్ బాబు. ప్రచారంలో టీడీపీని బాగా డ్యామేజ్ చేసేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై ఘాటైన విమర్శలు గుప్పించారు. దీంతో వైసీపీ అధికారంలోకి వస్తే మోహన్ బాబుకు మంచి పదవి లభిస్తుందని ప్రచారం జరిగింది. టీటీడీ చైర్మన్ లేదా రాజ్యసభ పదవి ఇస్తారనే అప్పట్లో ఊహాగానాలూ వచ్చాయి.
అయితే జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా మోహన్ బాబుకు ఎలాంటి పదవి లభించలేదు. అసలు తాను పదవులు ఆశించడం లేదని పైకి మోహన్ బాబు అంటున్నప్పటికీ ఈ విషయంలో కాస్త అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది. మోహన్ బాబు కోరుకున్నట్లు భావిస్తున్న టీటీడీ ఛైర్మన్ పదవిని సీఎం జగన్ తన బాబాయి వైవి సుబ్బారెడ్డికి కట్టబెట్టడం, అలాగే రాజ్యసభకు ఎంపిక విషయంలోనూ మొదటి నుంచి తన పేరు పరిశీలించక పోవడంతో మోహన్ బాబు కొంత అసంతృప్తితో ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కుమార్తె, కుమారులతో మెహన్ బాబు ప్రధాని మోదీని కలవడంతో బీజేపీలో చేరతారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే తాను కేవలం మర్యాదపూర్వకంగానే ప్రధానిని కలిశానని మోహన్ బాబు నాడు వివరణ ఇచ్చారు.
అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే మోహన్ బాబు… సీఎంగా జగన్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు చెప్పకపోవడం. ఇది వైసీపీ వర్గాలలో చర్చనీయాంశం అయింది. దీనికి తోడు మోహన్ బాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలు జగన్ తో ఏర్పడిన గ్యాప్ కు సంకేతమని అనుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు ఉంటాయని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. తన కుమారుడు మనోజ్ రాజకీయాల్లో వస్తానంటే వద్దని చెబుతాననీ అన్నారు. ఈ వ్యాఖ్యలు మోహన్ బాబుకు సీఎం జగన్కు మధ్య గ్యాప్ కు సంకేతం కావచ్చని పుకార్లు షికారు చేస్తున్నాయి.