అమరావతి: ఈవిఎంలను సాకుగా చూపి ఎన్నికల సంఘంపై తిరుగు బాటు బావుటా ఎగరెయ్యాలనుకున్న చంద్రబాబుకు మిత్ర పక్షాలు కూడా కలిసి రాని పరిస్థితి ఏర్పడిందని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు అన్నారు.
ఈవిఎంల సమస్యలపై ఢిల్లీలో చంద్రబాబు మిత్ర పక్షాలతో ఏర్పాటు చేసిన సమావేశంపై జివిఎల్ మాట్లాడుతూ..కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తప్ప మరెవరూ ఈ సమావేశానికి హాజరు కాలేదని జివిఎల్ అన్నారు.
చంద్రబాబు తన స్వార్ధ ప్రయోజనాల కోసం అధికారులను ఉపయోగించుకుంటున్నారని జివిఎల్ ఆరోపించారు. తనకు నచ్చిన అధికారులు లేకపోతే చంద్రబాబుకు ఓట్లు పడవని జివిఎల్ దుయ్యబట్టారు. చంద్రబాబు నిజంగా మంచి పనులు చేసి ఉంటే అధికారుల అవసరం ఎందుకని జివిఎల్ ప్రశ్నించారు.
2014లో చంద్రబాబు ఈవిఎంల గురించి ఎందుకు మాట్లాడలేదని జివిఎల్ నిలదీశారు. మూడు కోట్ల మంది ఓటర్లు తాము ఏ పార్టీకి ఓటేశామన్నది వివిప్యాట్ల ద్వారా తెలుసుకున్నారనీ, ఒక్క ఓటరైనా వివి ప్యాట్ లపై ఫిర్యాదు చేసారా? అని జివిఎల్ ప్రశ్నించారు.
ఈవిఎంలపై ఎవరికీ అనుమానం అవసరం లేదని జివిఎల్ తెలిపారు. వివి ప్యాట్ లెక్కింపు పై ఇప్పటికే సుప్రీం తగిన సూచనలు చేసిందని జివిఎల్ పేర్కొన్నారు. చంద్రబాబు తన ఓటమికి కారణం ఇతరులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని జివిఎల్ అన్నారు. టిడిపి ఓడిపోతుందని చంద్రబాబు ఢిల్లీలో దండోరా వేస్తున్నారని జివిఎల్ ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ రాజకీయ సలహాదారుగా పని చేస్తున్నరని జివిఎల్ ఆరోపించారు. ఫిరాయింపులను ప్రోత్సహించటం, ఎమ్మెల్యేలను కొనటంలో ఇంటెలిజెన్స్ పాత్ర ఉందని అందరూ అంటున్నారని జివిఎల్ చెప్పుకొచ్చారు. పోలీసు అధికారులను పొలిటికల్ మేనేజ్ మెంట్ కోసం వాడుకుంటున్నారని జివిఎల్ పేర్కొన్నారు.
ఈవిఎంల వల్ల కాదు, అవినీతి వల్లే చంద్రబాబు ఓడిపోనున్నారని జివిఎల్ అన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా వస్తుందో లేదో అనే అనుమానం ఉందని జివిఎల్ అభిప్రాయపడ్డారు.