రాజకీయాలలో గెలుపు, ఓటములు సహజం. అయితే ఓటమితో నిరుత్సహాపడకుండా ముందుకు సాగితే ఆ ఓటమే గెలుపునకు సోపానం అవుతుంది. అంటే ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవన్న సూక్తి అందరికి తెలిసే ఉంటుంది. అదే మాదిరిగా 2014 ఎన్నికల్లో వైకాపా అధికారాన్ని సాధించక పోయినా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ఎన్నికల ఫలితాలను ఒక పాఠంగా స్వీకరించి మొక్కవోలిన విశ్వాసంతో రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించి ప్రజలకు నమ్మకం కల్గించారు. ఆ ఫలితంగా 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ నేతృత్వంలో వైకాపా 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ స్థానాలతో ఘన విజయం సాధించింది.
ఇది ఇప్పుడెందుకు చెపుతున్నామంటే..గత ఎన్నికల్లో బీఎస్పీ, వామపక్ష కూటమిగా బరిలో దిగిన జనసేన ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి అయినా గెలుపు ఓటములను ప్రభావితం చేయకల్గిన కాపు సామాజిక వర్గం ఓట్లను సైతం జనసేన ఒన్ చేసుకోలేకపోయింది. అందుకు ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు కులం లేదు, మతం లేదు అంటూ ఇతర వర్గాలను ఆకట్టుకోవాలని ప్రయత్నం చేయడంతో అసలుకే మోసం వచ్చింది. దీనికి తోడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక్కటేననీ, జనసేనకు సీట్లు వస్తే చంద్రబాబు కే మద్దతు ఇస్తారని ప్రచారం జరగడంతో కాపు సామాజిక వర్గంలోని బలమైన నేతలు కూడా పవన్ పంచన చేరకుండా వైసీపీకి మద్దతుగా నిలిచారు.
పార్టీ ఓటమితో పవన్ కు జ్ఞానోదయం అయినట్లు ఉంది. రాజకీయ పరిణామాలు బేరీజు వేసుకొని బీజేపీతో జత కట్టారు. తొలి నుండి కాపుల రిజర్వేషన్ అంశంతో సహా కాపు సామాజిక వర్గీయుల సమస్యలపై సూటిగా మాట్లాడని పవన్ కళ్యాణ్ ఇటీవల రిజర్వేషన్ అంశం గురించి మాట్లాడటం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. పవన్ కు తత్వం భోదపడిందని అందుకే సొంత సామజిక వర్గీయుల మద్దతు కోసం ఈ విధంగా మాట్లాడి ఉంటారని అనుకుంటున్నారు.
వైకాపా ప్రభుత్వంపై పవన్ విమర్శలు చేయడంపై ఆ పార్టీలోని కాపు సామాజిక వర్గ నేతలు తీవ్రంగా స్పందించారు. మంత్రి కురసాల కన్నబాబు, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, తోట త్రిమూర్తులు తదితర కాపు సామాజిక వర్గ నేతలు పవన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం చూశాం. అయితే వైకాపా నేతలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు జనసేన సిద్ధం అవుతుందని అంటున్నారు.
బీజేపీ అండతో జనసేనాని రాబోయే రోజుల్లో ఏ విధంగా రాజకీయాలు చేస్తారో వేచి చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?