అమరావతి: వైసిపి అధినేత జగన్, ఆ పార్టీ రాజ్యసభ సభ్యడు విజయసాయిరెడ్డిలపై ఉన్న కేసులు సాగతీయకుండా చూస్తే వారి బండారం బయటపడుతుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు వ్యాఖ్యానించారు.
బుధవారం కుటుంబరావు అమరావతిలో మీడియాతో మాట్లాడారు. జగన్, విజయసాయి రెడ్డిలు బెయిల్ నిబంధనలు పాటిస్తున్నారా అని కుటుంబరావు ప్రశ్నించారు. జగన్ ఎన్నికల అఫిడవిట్లో ఎక్కువ పేజీలు ఆయన నేరచరిత్రకు సంబంధించినవే ఉన్నాయని కుటుంబరావు విమర్శించారు. విజయసాయిరెడ్డి రాజ్యసభకు నామినేట్ అయినప్పుడు ఆయన అఫిడవిట్ కూడా ఇలానే ఉందని కుటుంబరావు పేర్కొన్నారు.
నిజంగా మేము నిర్ధోషులం అని మీరు అనుకుంటే ఆరు నెలల్లో కేసులన్నీ పరిష్కారం చేయమని కోర్టుని అడగగలరా అని కుటుంబరావు సవాల్ విసిరారు. తనపై ఒక్క ఆరోపణ కూడా లేదని, ఉంటే నిరూపించాలని కుటుంబరావు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక మంత్రిగా ఉన్నది యనమలా? కుటుంబరావా? అని విజయసాయిరెడ్డి చేసిన కామెంట్లపై కౌంటర్ ఇస్తూ తానెప్పుడూ ఆర్ధిక శాఖ నిర్ణయాలకు సంబంధించిన సమావేశాల్లో పాల్గొనలేదని కుటుంబరావు అన్నారు. ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడి హోదాలో మాత్రమే కొన్ని సమావేశాలకు హాజరయ్యానని కుటుంబరావు స్పష్టం చేశారు.
విజయసాయిరెడ్డి వాడిన పదజాలాన్ని ట్విట్టర్లో ఇంత వరకు ఎవరూ వాడలేదని కుటుంబరావు అన్నారు. ఆయన పోస్ట్ చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఇకనైనా విజయసాయిరెడ్డి ఆ పోస్టులను తొలగించాలని కుటుంబరావు సూచించారు.