పరిస్థితులే ఏ మనిషినైనా రాటుతేలేలా చేస్తాయి.సంక్షోభాలు ఎదురైనప్పుడు రాజకీయనాయకులు తమ సత్తా చూపుకొనే ప్రయత్నాలు సాగిస్తారు. ఇందుకు ఉదాహరణగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు టీడీపీ భావి సారధి లోకేషు ను చెప్పుకోవచ్చు.నిన్నమొన్నటి వరకు తండ్రి చాటు బిడ్డగా, లోకం పోకడ తెలియని నాయకునిగా అందరూ లోకేషు ను చిన్నచూపు చూశారు. లోకేష్ కూడా జయంతికి వర్ధంతికి తేడా తెలియకుండా మాట్లాడి ప్రత్యర్థులకు దొరికిపోయేవారు.లోకేష్ ప్రసంగం విన్యాసాలపై పంచ్ డైలాగులు పడేవి.మంత్రిగా ఉన్నా కూడా ఆయన ఎందుకో ప్రజలతో మమేకం కాలేక పోయారు.మంగళగిరిలో ఓడిపోయాక ఆయనకి ఇక రాజకీయ భవిష్యత్తు లేదన్న నిర్ణయానికి తెలుగుతమ్ముళ్లే వచ్చేశారు.
ఇక కరోనా సమయంలో తండ్రీకొడుకులిద్దరూ హైద్రాబాదుకి పరిమితమై పార్టీని ఏపీలో గాలికొదిలేశారు.మరోవైపు వైసిపి ప్రభుత్వం దూకుడు పెంచి టిడిపిని చెడుగుడు ఆడటం మొదలు పెట్టింది.ఆ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర మాజీ శాసనసభ్యుడు జెసి ప్రభాకర్ రెడ్డి తదితరులను జైలుకు పంపే వరకు వెళ్లింది.ఈ నేపథ్యంలో టిడిపి మనుగడే ఇక కష్టసాధ్యమన్న ఊహాగానాలు సాగాయి.అయితే ఒక్కసారిగా లోకేశ్ రంగంలోకి దిగాడు. వయో భారంతో ఉన్న తండ్రి చంద్రబాబు ఇక అంత చురుగ్గా పని చేయలేరని లోకేష్ భావించినట్లు కనిపిస్తోంది.దీంతో ఆయన కొత్త ఉత్సాహం తెచ్చుకుని బరిలోకి దిగారు. తాజాగా రాష్ట్రంలో సంభవించిన వరదల నేపథ్యంలో ఆయన ఊరూవాడా తిరుగుతున్నాడు.నేరుగా ప్రజలతో కలిసి పోతున్నాడు. ప్రసంగం నైపుణ్యాన్ని కూడా పెంచుకున్నారు .
వరదల వల్ల నష్టపోయిన రైతులకు భరోసా ఇస్తున్నారు.మరోవైపు ట్విట్టర్ వేదికగా వైసిపి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఏకరువు పెడుతున్నారు.అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరణించిన కుటుంబాలకు తెలుగుదేశం సంక్షేమ నిధి కింద రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా చురుగ్గా ఉన్న టిడిపి నాయకులతో లైజాన్ నెరుపుతున్నారు. ఇన్నాళ్లు లోకేష్ మీద టీడీపీ శ్రేణులెవ్వరికీ పెద్దగా నమ్మకాలు ఉండేవి కావు. అయితే తాజాగా లోకేష్ లో వచ్చిన మార్పు ,ఆయన చూపుతున్న వేగం తెలుగు తమ్ముళ్లకు ఆనందం కలిగిస్తున్నాయి.కొత్త లోకేశ్ పుట్టుకొచ్చాడని, ఇక పార్టీ తప్పనిసరిగా బలోపేతం కాగలదని వారు ఆశలు పెంచుకుంటున్నారు.