తెలంగాణ టిడిపిలో కీలక నేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితునిగా పేరున్న ఖమ్మం మాజీ ఎంపి నామా నాగేశ్వరరావు పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీకి, పొలిట్ బ్యూరో సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేశారు.
రాష్ట్రంలో టిడిపికి మనుగడ లేదని భావించిన ఆయన అటు కాంగ్రెస్లో గానీ, తెరాసలో గానీ చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన టిఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్తోనూ భేటీ అయ్యారు. దీంతో టిఆర్ఎస్లో చేరిక ఖాయమని తెలుస్తోంది. మరోవైపు టిఆర్ఎస్ ఖమ్మం ఎంపీగా ఆయనను బరిలోకి దింపే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఖమ్మం ఎంపిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి 2014 లో వైసిపి తరుపున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత టిఆర్ఎస్లో చేరారు. రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ శ్రీనివాస రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు విముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.
మొన్న జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శ్రీనివాస రెడ్డి మూలంగానే టిఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారని టిఆర్ఎస్ అధిష్టానం భావిస్తుందనీ, అందులో భాగంగా లోక్ సభ ఎన్నికల్లో పొంగులేటికి టికెట్ నిరాకరిస్తున్నట్టు వార్తలొచ్చాయి.
ఇప్పటికే పొంగులేటికి ప్రత్యామ్నయంగా పలువురు పేర్లు తెరమీదకొచ్చాయి. ఇప్పుడు నామా చేరితే ఆయనకే టికెట్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా కూటమి తరఫున నామా పోటీ చేశారు. టిఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?