8 మంది ఎమ్మెల్యేలు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి విచ్చలవిడిగా తిరిగారు…! డాక్టర్ సుధాకర్ ని రోడ్డుపై పోలీసులు చేతులు కట్టేసి కొట్టి, ఆసుపత్రికి తరలించారు…! గ్రామా సచివాలయ కార్యాలయాలకు వైసిపి రంగులు వేస్తున్నారు…! ఇవన్నీ జరిగిన ఘటనలే ఇప్పుడు వైసిపికి, సీఎం జగన్ కి తలనొప్పులుగా మారాయి. కోర్టులో చిక్కులతో తలలు పట్టుకుంటున్న ప్రభుత్వానికి ఈ తాజా మూడు అంశాలపై హైకోర్టు సీరియస్ గా స్పందించింది. ప్రభుత్వం ఏర్పాటై పూర్తిగా ఏడాది కూడా గడవక మునుపే కోర్టులో వరుస కేసులతో, సమాధానాలు చెప్పుకోలేక ఎదురీదుతోంది. తాజాగా ఈ ఒక్కరోజే మూడు కేసులపై హైకోర్టు విచారణ చేయడం.. ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనించాల్సిన విషయం. ఆ కేసులు, ఆ అంశాలు ఏమిటో చెప్పుకుందాం.
వైద్యుడి విషయంలో కోర్టు కీలక ఉత్తర్వులు…!
వైద్యుడు సుధాకర్ అరెస్టుకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ సెషన్స్ జడ్జి నేరుగా సుధాకర్ ఉన్న ఆసుపత్రికి వెళ్లి వాంగ్మూలం నమోదు చేయాలని ఆదేశించింది. రేపు సాయంత్రంలోగా వాంగ్మూలాన్ని హైకోర్టుకు సమర్పించాలని సూచించింది. సుధాకర్ గొడవ చేస్తున్నట్లు స్థానికులు చెప్పగా, పోలీసులు వెళ్లారు. పోలీసులను, ముఖ్యమంత్రిని కూడా దుర్భాషలాడటంతో అదుపులోకి తీసుకున్నారు. విధులకు ఆటంకం కలిగించినందుకు వైద్యుడిపై 353, 427 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన్ను కొట్టిన ట్రాఫిక్ కానిస్టేబుల్ మధుబాబును సస్పెండ్ చేశారు. సుధాకర్ మానసిక పరిస్థితి బాగోలేదని కేజీహెచ్ వైద్యులు చెప్పడంతో.. పోలీసులు ఆయనను ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తరలించారు. తాజాగా కోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది.
కార్యాలయాలకు రంగులపై తీర్పు వాయిదా…!
ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల అంశంపై వాదనలు ఈరోజుతో ముగిసాయి. తీర్పును కోర్టు రిజర్వ్ లో ఉంచింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 623ను సవాలు చేస్తూ దాఖలై న పిటిషన్ వేయగా, దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. భవనాలపై వైసీపీ జెండా రంగులే కనిపిస్తున్నాయని పిటిషనర్ తరుపు వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. ఈ అంశంలో ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పు వస్తే ఇదే పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఎందుకంటే గతంలో ఇదే అంశమై ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.
ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై…!
ఆ ఎనిమిది మంది వైసీపీ ఎమ్మెల్యేల పై విచారణ ఎందుకు ఆదేశించకూడదు! అంటూ హైకోర్టు ప్రభుత్వానికి సూటి ప్రశ్న వేసి కేసుని విచారణకు స్వీకరించింది.” ప్రపంచ వ్యాప్తంగా కరోనా విస్తరించిన నేపద్యంలో వివిధ దేశాలు లాక్ డౌన్ కు వెళ్ళాయి. భారత దేశంలో కూడా కరోనాని కట్టడి చెయ్యటానికి లాక్ డౌన్ ఒక్కటే మార్గం అని నిర్ణయం తీసుకుని దేశం మొత్తం లాక్ డౌన్ విధించింది. గత రెండు నెలలుగా లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేసింది. ప్రజలను కూడా రూల్స్ ఫాలో అయ్యేలా చేసారు. ప్రజలు కూడా సహకరించారు. అయితే కొద్ది మంది ఏదైనా అవసరాల కోసం రోడ్డు ఎక్కినా వారిని బయటకు రానివ్వలేదు. పోలీసులు కఠినంగా వ్యవహరించారు. ప్రజలే ఇలా పనులు అన్నీ మానుకుని, ఉపాధి మానుకుని, పనులు మానుకుని సహకరిస్తే, మన రాష్ట్రంలో నాయకులు మాత్రం అందుకు భిన్నమైన పరిస్థతి. ప్రజలు బాగానే సహకరించినా, ఏకంగా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు రోడ్డులు ఎక్కి, హడావిడి చేసి, కోరోనా టైంలో ఇబ్బంది పెట్టారంటూ పిటిషన్ దాఖలవ్వగా దీనిపై కోర్టు సీరియస్ గానే స్పందించింది. ప్రజా ప్రతినిధులు అయ్యుండి మీరే రూల్స్ అతిక్రమిస్తే ఎలా అంటూ కోర్ట్ వారి పై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు ఉల్లంగించిన వారి పై ప్రభుత్వం చర్య తీసుకోలేదు కాబట్టి, వీరి పై విచారణ ఎందుకు వెయ్యకూడదో చెప్పాలి అంటూ హైకోర్ట్ ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వం నుండి సరైన స్పందన రాకుంటే తలనొప్పులు తప్పవు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?