YS Jagan .. నిమ్మగడ్డ వ్యూహం ముందు మళ్ళీ జగన్ ఓడారా.. అంటే పరిస్థితులు అలానే అనిపిస్తున్నాయి. ప్రభుత్వం.. ఎన్నికల కమిషన్ కలసి పని చేసి పంచాయతీల అభివృద్ధికి తోడ్పడతాయి ఎక్కడైనా. కానీ.. ఏపీలో పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. గతంలో ఎన్నడూ లేనంతగా.. సదూర భవిష్యత్తులో ఎన్నికల నిర్వహణకు ఒక గుణపాఠంలా ప్రస్తుతం ఎన్నికల ప్రహసనం మారింది. సరే..! శాసన వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ మధ్య పొరపొచ్చాలు వచ్చాయనుకుంటే ఓ పద్దతి. కానీ.. ఈ పోరు సీఎం వైఎస్ జగన్, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మధ్య పోరు (ఇగో)లా మారిపోయింది. రాష్ట్ర ప్రజలంతా చిత్ర విచిత్రంగా చూసిన ఎన్నికల సిత్రం ఈ పంచాయతీ ఎన్నికలు. ఏడాదిగా జరిగిన పోరాటంలో రాజ్యాంగ వ్యవస్థ విజయం సాధించింది. అక్కడితో ఆగకుండా.. జూలు విదిల్చిన సింహాంలా ఎన్నికలు జరిపిస్తోంది. ఇప్పుడు మరో విషయంలో కూడా ప్రభుత్వంపై ఎన్నికల కమిషన్ పైచేయి సాధించింది.
YS Jagan : ఏకగ్రీవాలు మొదలైంది ఇలా..
పంచాయతీ ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. అదే.. ‘ఏకగ్రీవాలు’. గ్రామాల్లో కాబట్టి పట్టింపులు, పంతాలు, ఒకరికొకరికి తెలియడం వంటి పరిస్థితుల్లో పోరు ఎందుకని ఏకగ్రీవ ఎన్నికను తీసుకొచ్చారు. 1960లో తొలిగా రాజస్థాన్ లో ప్రారంభమైన ఈ పద్ధతి తర్వాత అనేక రాష్ట్రాల్లో అమలయ్యింది. 2001 నుంచి ఉమ్మడి ఏపీలో ఈ పద్ధతి ప్రారంభమైంది. 2013 నుంచి ఏకగ్రీవ ఎన్నికలకు ఇచ్చే మొత్తం రెట్టింపు అయింది. పోటీ లేకుండా ఎన్నికైతే గ్రామాల అభివృద్ధికి వచ్చే నిధులు అదనంగా లభించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఇప్పుడీ పద్ధతినే వైసీపీ ప్రభుత్వం హైలైట్ చేసింది. 2001లో కేటగిరీల ప్రకారంగా అత్యధికంగా 50వేలు ఉంటే.. 2008, 2013లో లక్షలకు పెరిగింది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం మరింత పారదర్శకంగా 4 కేటగిరీలుగా విభజించి 5,10,15,20 లక్షల నగదు ప్రోత్సాహం ప్రకటించింది. ఎన్నికల కమిషన్ పై పైచేయి సాధించేందుకు వైసీపీ ప్రభుత్వం సంధించిన ఆఖరి అస్త్రంగా దీనిని చెప్పాలి. అయితే.. ఇక్కడ ప్రభుత్వం పాచిక పారలేదనే చెప్పాలి.
YS Jagan : ఎన్నికల కమిషన్ మాటే గెలిచిందా..
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలిదశ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలో శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల్లో సంఘటనలు తప్ప పెద్దగా ప్రతికూల పరిస్థితులు ఎక్కడా జరగలేదు. అలాగే.. ప్రభుత్వం చూపించిన ఏకగ్రీవాలు కూడా అతి తక్కువ సంఖ్యలోనే జరిగాయి. అయితే అనూహ్యంగా అభ్యర్ధులంతా పోటీకి సిద్ధమవడమే ఆశ్చర్యపరుస్తోంది. ఈరోజు ఎన్నికల సంఘం ప్రకటించిన లెక్కల ప్రకారం లక్ష నామినేషన్లు దాఖలయ్యాయి. ఇది నిజంగా రికార్డే. ఇద్దరి మధ్య జరిగిన ప్రతిష్టాత్మక పోరులో ఎన్నికల సంఘం మరో విజయం నమోదు చేసుకున్నట్టే. ఏకగ్రీవాల కంటే పోటీ పడటం ముఖ్యమని సూచించిన ఎన్నికల కమిషన్ మాటే చెల్లింది. గత మూడు రోజుల్లో తొలి విడత ఎన్నికలు జరిగే జిల్లాల్లో మొత్తంగా సర్పంచ్ పదవులకు 19వేల 491 నామినేషన్లు, వార్డు మెంబర్ల పదవులకు 79వేల 799 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా 99,290 నామినేషన్లు రావడం విశేషం. అంటే ప్రభుత్వం ప్రకటించిన తాయిలాలకు ఎవరూ ఆశ చూపలేదనే అర్ధమవుతోంది. ఎన్నికల కమిషన్ పై ఇక్కడైనా పైచేయి సాధించాలన్న జగన్ ప్రభుత్వం ఆశ తొలిదశలో నెరవేరలేదు. ఈ ఆఫర్ల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదనే అభ్యర్ధులు ముఖాముఖి పోరుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
మలి విడతల పరిస్థితేంటో..?
ఈ ప్రహసనంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అనుసరించిన విధానాలు కూడా అభ్యర్ధులు పెద్దగా ఏకగ్రీవాల వైపు దృష్టి సారించకపోవడానికి కారణం అని చెప్పొచ్చు. నిజమైన ఏకగ్రీవాలకు అభ్యంతరం లేదన్న నిమ్మగడ్డ బలవంతపు ఏకగ్రీవాలను మాత్రం సహించమని ముందే చెప్పారు. అందుకు అనుగుణంగానే షాడో టీమ్స్ ను రంగంలోకి దింపారు. ఇందుకు ఆయన నియమించిన స్పెషల్ డీఐజీ సంజయ్ ఆయన అప్పజెప్పిన పని పూర్తి చేశారు. వీరితోపాటు జిల్లా కలెక్టర్లు, పోలీసులు కూడా కార్య రంగంలోకి దిగి నామినేషన్లు ఎక్కువగా దాఖలయ్యేలా చేశారు. ఏకగ్రీవం కంటే పోటీ ఉంటేనే మంచిదనే నిమ్మగడ్డ వ్యాఖ్యలు అందరికీ ఆమోదయోగ్యం అయ్యాయి. దీంతో ప్రభుత్వం పెంచి ప్రకటించిన ఏకగ్రీవ నగదు మొత్తాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. మరి.. మిగిలిన మూడు విడతల్లో అయినా ప్రభుత్వ వాదన గెలుస్తుందో.. తొలి విడత స్ఫూర్తితో పోటీ పడతారో చూడాల్సి ఉంది.