నాయకత్వం ఏమంత ఈజీ కాదు. నలుగురిలో మాట్లాడడం సులువూ కాదు. రాజకీయం చేయడం మామూలు విషయం కానే కాదు..! కానీ ఈ అన్ని విషయాల్లో ఆరితేరిన నేతగా కేటీఆర్ కి కీర్తి వచ్చేసింది. తండ్రికి తూగిన తనయుడిగా కేటీఆర్ కి తెలంగాణలో ఖ్యాతి వచ్చింది. అందుకే కేసీఆర్ కూడా తన కుమారుడి పట్టాభిషేకానికి ముహుర్తాలు ఫిక్స్ చేస్తున్నారు. వచ్చే ఏడాది జులైలో కేటీఆర్ ని సీఎం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆ తర్వాత తాను ఢిల్లీ వీధుల్లో తిరుగుతూ జాతీయ రాజకీయం పాటలు పాడుకోవాలనేది ఆయన ప్లాన్. మరి కేటీఆర్ ని తెలంగాణ ప్రజలు స్వాగతిస్తారా..? ప్రజలు అనే కాదు.., టీఆరెస్ శ్రేణులు, నాయకులూ అంగీకరిస్తారా..? సీఎం తనయుడిగా కాకుండా.. కేటీఆర్ గా ఆయన సొంత ముద్ర వేసారా..? అనే నిర్మొహమాటంగా వేశారు, మంచి నాయకుడు.., మంచి వాగ్ధాటి ఉంది అనే చెప్తారు. కానీ అసలు కథ వేరు. అసలు కేటీఆర్ వేరు. అదేమిటో ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది.
కొంచెం తగ్గాలోయ్ నాయకా..!!
కేటీఆర్ మాటలు భలే ఉంటాయి. బెల్లం ముక్క తినిపిస్తారు. తండ్రి కేసీఆర్ తో పోటీ పడతారు. అందుకే ఆయన నాయకుడిగా నారా లోకేష్ కంటే, జగన్ కంటే త్వరగా ఎదిగారు. తానేమి బంగారు పళ్లెంలో తినలేదని.., ఉద్యమం చేసి, తన్నులు తిని.., తెలంగాణ సాధించి ఈ స్థాయిలో ఉన్నానని పదే పదే చెప్తుంటారు. అయితే ఇక్కడ కేటీఆర్ బయటకు కనిపించేది వేరు, లోపల మనిషి వేరు అనేది టీఆరెస్ వర్గాల్లోనే వినిపిస్తుంది.
* కేసీఆర్ సాధారణంగా ఏ ఎమ్మెల్యేకి, మంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వరు. ఎవరైనా అడిగినా తిరస్కరిస్తారు. కానీ ఒకసారి, ఒక టైం కి అపాయింట్మెంట్ ఇచ్చారంటే ఆరు నూరైనా ఆ టైం కి కలుస్తారు. ఎక్కువగా వెయిట్ చేయనివ్వరు. మాట్లాడి, ముచ్చటించి పంపిస్తారు. వారికి కూడా కలిశామన్న తృప్తి కలిగిస్తారు.
* కానీ కేటీఆర్ అలా కాదు. ఈయనకి త్వరలో పట్టాభిషేకం అని టీఆరెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అతి త్వరలోనే ముఖ్యమంత్రి కాబోతున్నారు అంటే.. మరి ఎమ్మెల్యేలు కలుస్తారు, నేతలు వస్తారు, అపాయింట్మెంట్ అడుగుతారు, కోరికలు కోరతారు, సమస్యలు చెప్తారు. పార్టీకి ప్రధాన దిక్కుగా.., ప్రభుత్వాధినేతగా కేటీఆర్ ఎదిగే దశలో ఉన్నారు కాబట్టి ఈయన కూడా వారితో టచ్ లో ఉండాలి. కానీ ఈయన తండ్రి కంటే ఎక్కువ చేస్తున్నట్టు టీఆరెస్ వర్గాల్లో చర్చ ఉంది. అసలు అపాయింట్మెంట్ ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా చెప్పిన సమయానికి రారు. గంటల కొద్దీ వెయిట్ చేయిస్తారు. ఇటీవల ఇద్దరు మంత్రులు కేటీఆర్ ని కలవడానికి వచ్చి 6 గంటలు వెయిట్ చేసి, చేసి వెళ్లిపోయారట. అంతకు ముందు కొందరు ఎమ్మెల్యేలు కూడా ఇదే తీరున రావడం, కలవలేక నిరాశగా వెళ్లిపోవడం జరుగుతుంది.
సిరిసిల్లలో టాక్ ఇలా ఉంది..!!
సరే ఎమ్మెల్యేలు, మంత్రులు అంటే తన కింద మనుషులు అనే భావన కేటీఆర్ లో ఉండవచ్చు. కానీ సిరిసిల్ల నాయకులూ మాత్రం తన కింద మనుషులు కాదు, తన సొంత మనుషులు. తనని నెత్తిన పెట్టుకుని గెలిపిస్తున్న మనుషులు. అక్కడి నేతలతో కేటీఆర్ బాగుంటేనే భవిష్యత్తు బాగుంటుంది. కానీ..
* సిరిసిల్ల నాయకులతో కూడా కేటీఆర్ టచ్ ఇటీవల తగ్గింది. రెండు వారాల కిందట సిరిసిల్ల నియోజకవర్గం నుండి 23 మంది సర్పంచులు కేటీఆర్ ని కలవడానికి, ముందుగా అపాయింట్మెంట్ తీసుకునే ఆయన కార్యాలయానికి వచ్చారు. ఉందయం నుండి సాయంత్రం వరకు వెయిట్ చేసినా పిలుపు రాలేదు. కేటీఆర్ కూడా అక్కడికి రాలేదు. ఉదయం 11 గంటల నుండి రాత్రి 7 వరకు వెయిట్ చేసిన తర్వాత ఇక విసిగిపోయి ఆ సర్పంచులు తిరుగు ప్రయాణం అవుతుండగా.. ఓ కీలక నాయకుడు కల్పించుకుని.., వారిని బతిమాలి కేటీఆర్ కార్యాలయం పక్కనే ఉన్న టూరిజం గెస్ట్ హౌస్ లో ఆ రాత్రికి విడిది ఏర్పాటు చేసారు. ఆ తర్వాత రోజున ఉదయాన్నే కేటీఆర్ ని కలవగలిగారు. ఇక్కడితో ఆ 23 మంది సర్పంచులు షాక్ అవుతూనే.., ఏమిటీ మార్పు అంటూ చర్చించుకున్నారు..!
* అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అదేదో గొప్ప కాదు. అది నష్టమే. ఎంత నాయకుడైన కిందిస్థాయి నేతలను కలుపుకుంటేనే భవిష్యత్తు. వారి భుజాన నిలబడుతూ వారినే తొక్కాలని చూస్తే ఏపీలో టీడీపీ పరిస్థితే అక్కడ టీఆరెస్ కి పడుతుంది అని సొంత పార్టీలోనే అనుకుంటున్నారు.