(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: రాజధాని అమరావతికి మద్దతుగా టిడిపి నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో చేపట్టిన మహా పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలి నుండి అమరావతికి రైతులు పాదయాత్రగా బయలుదేరారు. నందివెలుగు సమీపంలో పాదయాత్ర చేరుకుగానే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు రైతులకు మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అలపాటిని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా రైతులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఆలపాటి రోడ్డు పక్కన కాలువలోకి పడటంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలీసుల తీరు పట్ల కార్యకర్తలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వెనక్కు తగ్గిన పోలీసులు నందివెలుగు గ్రామం దాటిన తరువాత మరో సారి పాదయాత్రను అడ్డుకుని అలపాటిని అరెస్టు చేశారు. బలవంతంగా ఆయనను పోలీసు జీపులో ఎక్కించుకుని దుగ్గిరాల పోలీసు స్టేషన్కు తరలించారు.పోలీసులకు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రైతుల పాదయాత్రతో అమరావతి – తెనాలి మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.