‘తలసాని’ వ్యవహారం టిడిపి అంతర్గత వ్యవహరాల్లోనూ చిచ్చుపెడుతోంది. కారణం ఈ విషయమై పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా టిడిపి శ్రేణులకు వార్నింగ్ ఇవ్వడంతోనూ ఆ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు నేరుగా కొందరు పార్టీ ముఖ్యులకి తాకేవిధంగా ఉండటమే. తలసాని ఎపి పర్యటన ఉదంతం టిడిపిని టార్గెట్ చేస్తూ ఉండటంతో పాటు ఆయన ఘాటు వ్యాఖ్యలు చంద్రబాబుని కించపరిచేలా ఉండటం ఒక్కసారిగా ఎపి రాజకీయాలని వేడెక్కించిన సంగతి తెలిసిందే. అయితే తలసాని ఎపి పర్యటనకు ఎపి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవుల్లో ఉన్న ఇద్దరు టిడిపి ముఖ్య నేతలే బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసినట్లు బైటకు తెలియడం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు పార్టీలో ఇతర ముఖ్యనేతల ఆగ్రహానికి కారణమైంది.
ఆ ఇద్దరు నేతలు మరెవరో కాదు…ఒకరు టిడిపిలో అనధికారికంగా నంబర్ 2 గా భావించే యనమల రామకృష్ణుడు కాగా మరొకరు టిటిడి ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్. వీరిద్దరూ తలసాని ఎపి పర్యటన సకల వైభోపేతంగా సాగేందుకు స్వయంగా పూనుకొని సకల ఏర్పాట్లు చేయించారని, సంక్రాతి వేడుకలతో పాటు సాక్షాత్తే శ్రీవారి సన్నిధిలోనూ సకల మర్యాదలు ఆయనకు లభించేలా అనుక్షణం శ్రద్ద తీసుకున్నారని వార్తలు రావడంతో ఈ విషయాలు తెలిసి కొందరు టిడిపి నేతలే ఆవేశంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది.
దీంతో వారిలో కొందరు ఈ విషయాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం…ఆ నేతల తీరు పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేయడంతో చంద్రబాబు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారని, తలసాని ఎపి పర్యటన విషయంలో సహకరించిన టిడిపి ముఖ్యనేతల తీరు పార్టీ శ్రేణుల్లో ఆగ్రహానికి కారణమైందని గుర్తించడం వల్లే వారిని పరోక్షంగా హెచ్చరిస్తూ ఘాటైన వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. చంద్రబాబు చేసిన హెచ్చరికలు చూస్తే ఆ విషయం ఆర్థం అవుతుందని చెప్పుకుంటున్నారు.
ఇదంతా ఒకెత్తయితే తలసాని వ్యవహారంపై ఇంత రగడ జరిగినా, సాక్షాత్తూ పార్టీ అధ్యక్షుడే స్పందించినా ఈ ఇద్దరు నేతలు ఇప్పటివరకు నోరు విప్పి ఒక్కమాట మాట్లాడక పోవడం సహచర టిడిపి నేతలనే కాదు ఆ పార్టీ శ్రేణుల్లోనూ అసంతృప్తికి మరింత ఆజ్యం పోసినట్లవుతోంది. పార్టీ కంటే వీరికి తలసానితో అనుబంధమే ఎక్కువనేలా వీరి తీరు ఉందని చర్చించుకుంటున్నారు. కనీసం చంద్రబాబు హెచ్చరిక అనంతరమైనా వీరు తలసాని విషయమై స్పందించి ఉంటే సమంజసంగా ఉండేదని అభిప్రాయపడుతున్నారు.
ఇంతకీ ఇంత జరిగినా వీరిద్దరూ తలసాని విషయమై మాట్లాడకపోవటానికి కారణం తలసాని వీరిద్దరికి బంధువు కావడంతో పాటు ఆయనతో ముడిపడివున్న వ్యాపార,వాణిజ్య సంబంధబాంధవ్యాలే కారణమని అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో నంబర్ 2 స్థాయిలో ఉన్న యనమల రామకృష్ణుడికి హైదరాబాద్ లో ఉన్న ఆస్తులు, వ్యాపార వ్యవహారాలను తలసాని శ్రీనివాసే చక్కబెడుతుంటారని…అందుకే ఆయన తలసానిని ఏమీ అనలేకపోతున్నారని…ఒక పుట్టా సుధాకర్ యాదవ్ కి తలసాని వియ్యంకుడు కావడం వల్ల ఏమీ మాట్లాడలేకపోతున్నారేమోనని పార్టీ నేతలే చెవులుకొరుక్కుంటున్నారు. ఏదేమైనా తలసాని తాను ఏ లక్ష్యంతోనైతే ఈసారి ఎపి టూర్ కి విచ్చేశారో ఫలితం తాను కోరుకున్నదాని కంటే ఎక్కువగానే లభించినట్లు ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.