(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాజధాని తరలింపు ఆందోళన నేపథ్యంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు అన్ని ప్రభుత్వ హత్యలేనని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఒక్కరొక్కరు ఆవేదనతో మృతి చెందుతున్నారు. తాజాగా మరో ఇద్దరు రైతులు గుండెపోటుతో కన్నుమూశారు. వీటిపై లోకేష్ నేడు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..రాజధాని కోసం స్వచ్చందంగా భూమి ఇచ్చిన రైతుల్ని జగన్ చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దున్నపోతు ప్రభుత్వం అక్రమ కేసులతో రైతులను బలితీసుకోంటోందని అన్నారు.
శాంతియుతంగా ఉద్యమంలో పాల్గొంటున్న కొడుకు, కోడలిపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడంతో రైతు అబ్బూరి అప్పారావు ఆందోళనతో మృతి చెందారనీ, మరో మహిళా రైతు సామ్రాజ్యమ్మ గుండె పోటుతో మరణించారని పేర్కొన్నారు. ఈ ఘటనలు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు. రాష్ట్రం కోసం త్యాగం చేసిన రైతులకి ఈ పరిస్థితి రావడం దారణమన్నారు. చేసేవి దొంగ పనులు కాబట్టే గ్రామాల్లో వేల సంఖ్యలో పోలీసులను దింపారని లోకేష్ విమర్శించారు. అసెంబ్లీకి వెళ్లడానికి ప్రజల మధ్య నుండి కాకుండా సిఎం జగన్ దొంగ దారిలో వెళ్లడానికి కొత్త రోడ్డు ఏర్పాటు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.