బీజేపీకి పార్లమెంటులో తిరుగు లేదు. ఏ బిల్లునైనా ఆమోదింపజేసుకోగలదు. ఏ చట్టం చేయాలన్నా గంటలోనే పూర్తి చేస్తుంది. కానీ రాజ్యసభలోనే ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఎన్డీఏ పక్షానికి రాజ్యసభలో సరైన బలం లేదు. ఓ బిల్లు ఆమోదం కోసం అవస్థలు పడుతోంది. మిత్రపక్షాలను, ప్రాంతీయ పార్టీలను దగ్గరకు చేసుకుంటోంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను కూడా బతిమాలుకుని బిల్లులను ఆమోదం చేసుకుంటోంది. ప్రస్తుత వ్యవసాయ బిల్లు కూడా అటువంటిదే. మూజువాణి ఓటుతో గట్టెక్కాల్సి వచ్చింది. ఈ మొత్తం తతంగంలో ఎన్డీఏకు అండగా నిలిచిన వైసీపీ పాత్రను చెప్పుకోవాల్సిందే. బీజేపీని ఆపత్కాలంలో ఆదుకున్న వ్యక్తిగా నిలిచారు సీఎం జగన్. మరి.. జగన్ కు ఏమిచ్చి రుణం తీర్చుకోగలదు బీజేపీ..!
ఏడాది నుంచి చెప్తోంది ఇదే.. జరిగిందిప్పుడు..
బలంగానే ఉన్న బీజేపీకి వైసీపీతో అవసరం ఏంటి? జగన్ ను ముప్పతిప్పలు పెట్టే అవకాశం ఉంది. ఏపీలో రాజకీయంగా ఎదగాలని భావిస్తోంది బీజేపీ. కానీ.. వైసీపీ విషయంలో బీజేపీ కొంత అనుకూలంగానే వ్యవహరిస్తోందనేది ఏడాది నుంచి ఉన్న సందేహాలకు ఇప్పుడు సమాధానం లభించింది. రాజ్యసభలో బలం లేని బీజేపీకి వైసీపీ తో అవసరం ఉంది. బిల్లుల ఆమోదానికి వైసీపీ సాయం తప్పనిసరి కావడంతో వైసీపీపై బీజేపీ సానుకూలంగానే ఉంటోంది. వారిద్దరి మధ్య అనధికారిక పొత్తు నడుస్తోందని ఏడాది నుంచి వ్యాఖ్యాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా నిన్న రాజ్యసభలో నిరూపితమైంది. ఎన్డీఏ ప్రభుత్వానికి ఆరుగురు వైసీపీ సభ్యులు అనుకూలంగా ఓటు వేయడంతో ఊపిరి పీల్చుకుంది. ఈ ఆరుగురు వ్యతిరేకించి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవి. అందుకే వైసీపీ-బీజేపీ బంధం వచ్చే ఎన్నికల వరకూ కొనసాగుతుందని భావించాల్సిందే.