అమరావతి: ప్రాజెక్టు పనులకు రివర్స్ టెండరింగ్ అమలులోకి వస్తుందనగానే టిడిపి నేతల్లో వణుకు మొదలవుతోందంటూ వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. బుధవారం విలేఖరుల సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై గురువారం విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
‘ప్రాజెక్టు పనులకు రివర్స్ టెండరింగ్ అమలులోకి వస్తుందనగానే మీకు, మీ అధినేతకు వెన్నులో వణుకు పుడుతుందా’ ఉమా అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ‘పోలవరంలో మీరు దోచుకున్న ప్రతి రూపాయి కక్కిస్తాం, మీలాగా కుల, వర్గ బలహీనతలు సిఎం జగన్కి లేవు, చూస్తారుగా తొందరెందుకు?’ అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
అవినీతి లేని రాష్ట్రంగా ఏపికి కొత్త ఇమేజి తీసుకొస్తామని సిఎం చెబుతుంటే పచ్చపార్టీ నేతలు పరిశ్రమలు రావంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. గతంలో ఐటి, ఈడి దాడులు జరిగితే వారు ఇలాగే మాట్లాడారనీ, అవినీతిని వ్యవస్థీకృతం చేసిన చంద్రబాబు అది లేకుండా పనులెలా జరుగుతాయనడంలో వింతేమీ లేదని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
పోలవరం ప్రాజెక్టులో మేధావుల సలహాలు కాదని తన బంధువు సూచనలకు జగన్ విలువ ఇస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. జగన్ తమ వర్గానికి పోలవరం పనులు కట్టబెట్టేందుకే రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడుతున్నారని దేవినేని దుయ్యబట్టారు. రివర్స్ టెండరింగ్ పేరుతో రివర్స్ పాలనకు ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని దేవినేని విమర్శించారు.