అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు పోలవరంలో దోచుకున్న సొమ్మును వెదజల్లి ఎన్నికల్లో గెలవాలనుకున్నా ప్రజలు తుపుక్కుమని ఉమ్మడంతో నడుములిరిగేలా నేలపై పడ్డారని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి విమర్శించారు. సోమవారం ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. డ్యామ్ పునాదుల నుండి అవినీతి సాక్షాలు ఉబికి వస్తున్నాయని ఆయన అన్నారు. ఎవరి కాళ్లు పట్టుకుని బయటపడాలా అని వెతుకుతున్నారని విమర్శించిన విజయసాయి అసలు సినిమా ఇప్పుడే మొదలైందని వ్యాఖ్యానించారు.
రివర్స్ టెండరింగ్, జ్యూడిషియల్ కమిషన్, అమ్మ ఒడి, గ్రామ వాలంటీర్ వ్యవస్థ, ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేయడం వంటి జగన్మోహనరెడ్డి అమలు చేస్తున్న సాహసోపేత పథకాలను, నిర్ణయాలను 15 రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మొదటి సారి సిఎం అయిన 46 ఏళ్ల యువకుడు దేశానికి మార్గదర్శిగా నిలుస్తున్నారని విజయసాయిరెడ్డి కొనియాడారు.
పుష్కరాల్లో 27మందిని పొట్టన పెట్టుకుని కుంభమేళాల్లో, బస్సు ప్రమాదాల్లో ప్రాణాలు పోవడం లేదా అంటూ చంద్రబాబు దబాయించారని గుర్తు చేస్తూ లాంచి ప్రమాదానికి ప్రైవేటు వ్యక్తులు కారణమైనా బాధ్యత ప్రభుత్వానిదే అని ముఖ్యమంత్రి హుందాగా అంగీకరించారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నాయకుడికి, ఈవెంట్ మేనేజర్ మధ్య తేడా ఇదేనని విజయసాయి వ్యాఖ్యానించారు.