న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియో గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీహార్ జైలులో అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి చిదంబరాన్ని కలిసి పరామర్శించారు. సోమవారం ఉదయం తీహార్ జైల్కు చేరుకున్న సోనియా, మన్మోహన్ సింగ్లు చిదంబరంతో సుమారు 20 నిమిషాలు భేటీ అయ్యారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందనీ, ప్రతి విషయంలోనూ మద్దతు ఇస్తామనీ చిదంబరానికి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. చిదంబరంతో పలు విషయాలపై చర్చించారు.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని ఈడి, సిబిఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. గత నెల 21న చిదంబరాన్ని సిబిఐ అరెస్టు చేసింది. ఈ నెల నాల్గవ తేదీ వరకూ సిబిఐ కస్టడీలో విచారించిన అధికారులు అయిదవ తేదీన ఆయనను జైలుకు తరలించారు.
కేంద్ర ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షసాధింపులో భాగంగానే చిదంబరాన్ని, డీకె శివకుమార్ను అరెస్టు చేయించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన విషయం విదితమే. ఢిల్లీ కోర్టులో చిదంబరం బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు రానున్న నేపథ్యంలో సోనియా, మన్మోహన్ సింగ్లు ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
సోనియా, మన్మోహన్లు చిదంబరంను జైలులో కలిసి పరామర్శించడంపై ఆయన కుమారుడు కార్తి చిదంబరం సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ రాజకీయ యుద్ధంలో సోనియా, మన్మోహన్లు తన తండ్రితో భేటీ కావడం కొండంత ధైర్యాన్ని ఇచ్చిందని కార్తి పేర్కొన్నారు. వారికి కార్తీ కృతజ్ఞతలు తెలియజేశారు.