Ys Jagan x Chandrababu.. మధ్య ‘పంచాయితీ’ని పంచాయతీ ఎన్నికలు ఏం తేలుస్తాయో.. అనే ఆసక్తి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అందరిలోనూ నెలకొంది. నిజానికి సీఎం వైఎస్ జగన్ వర్సెస్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మధ్య ఆధిపత్యానికి నిదర్శనం ఈ ఎన్నికలు. అయితే.. మూడో పక్షంగా పక్కనుండి పర్యవేక్షిస్తోంది మాత్రం టీడీపీ. ఇప్పుడే ఎన్నికలు నిర్వహించకూడదు అనుకున్న ప్రభుత్వానికి నిర్వహించాల్సిన పరిస్థితులు తీసుకొచ్చారు నిమ్మగడ్డ. ఏటిలోకి దిగిన తర్వాత ఈత కొట్టాలి.. తప్పదు కదా..! ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ చేస్తోంది ఇదే. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులను అందరినీ సిద్ధం చేశారు. అందుబాటులో ఉన్న అవకాశాలను పరిశీలించారు. ఏకగ్రీవాల మొత్తాలను పెంచారు. పోటీ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 90 శాతం గెలుపు సాధించాలని రేఖ గీశారు.
Ys Jagan ఏకగ్రీవాలు కాకుండా.. నామినేషన్లే ఎక్కువ..
ఫిబ్రవరి 9న జరిగే తొలి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల గడువు ముగిసింది. ఊహకందని నామినేషన్లు, తిరస్కరణలు జరిగాయి. మరో రెండు రోజుల్లో ప్రచారం కూడా మొదలవుతుంది. జగన్ ఆశించింది ఏకగ్రీవ ఎన్నికలు. కానీ.. తొలి విడతలో పోటీకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు అభ్యర్ధులు. ప్రభుత్వం ప్రకటించిన తాయిలాలకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు బుజ్జగింపులు పర్వం మొదలైంది. జగన్ ఆదేశించినా నామినేషన్లు ఎక్కువగా వచ్చాయంటే వైసీపీలో ఆశావాహులు ఎక్కువగా ఉండటమే కారణం. ఈ నేపథ్యంలో జగన్ నిర్దేశించిన 90 శాతం విజయాలు కష్టపడితే కానీ దక్కే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు రెబల్స్ కూడా ఎక్కువగా ఉంటున్నారు. వీరందరినీ బుజ్జగించడం పార్టీ నేతలకు తలకు మించిన భారమే. 4వ తేదీ గురువారం సాయంత్రానికి ఎంతమంది పోటీ నుంచి ఉపసంహరించుకుంటారు అనేది వైసీపీకి కీలకంగా మారింది. జగన్ మ్యానియా పార్టీని గెలిపిస్తుందనే ధీమా పార్టీలో ఉన్నా నాయకులు ఎక్కడా అశ్రద్ధ చూపకుండా ప్రయత్నించాల్సిందే.
చంద్రబాబుకు కావల్సిందే ఇది..
మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా పంచాయతీ ఎన్నికలను ఉపయోగించుకోవాలని చూస్తోంది. 2019 సాధారణ ఎన్నికల్లో తగిలిన భారీ దెబ్బ నుంచి టీడీపీ ఇంకా కోలుకోలేదు. తెలంగాణ అనుభవంతో ఏపీలో పార్టీని కాపాడుకోవడానికే అధినేత చంద్రబాబు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు, సీఎం జగన్ పై తన స్థాయికి మించి చేస్తున్న వ్యక్తిగత దూషణలు చంద్రబాబులో ఉన్న ఫ్రస్ట్రేషన్ కు నిదర్శనాలు. అందుకే వైసీపీకి ఉన్న ప్రజా బలాన్ని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. అచ్చెన్నాయుడు అరెస్టు, పట్టాభిపై దాడిని తనకు అనుకూలంగా మార్చుకోవాలనేది చంద్రబాబు ప్లాన్. వీటితో ఎన్నికల లబ్ది పొందాలనేది చంద్రబాబు ఆలోచన. నిజానికి ఇలాంటి వాటితోనే లబ్ది పొందడం, మీడియా అటెన్షన్ తనవైపుకు తిప్పుకోవడం చంద్రబాబుకు అలవాటు. ఇలా జరగడమే చంద్రబాబుకు కూడా కావాలి. అందుకే జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఎన్నికలకు వెళ్తున్నారు. అయితే.. ఇవన్నీ చంద్రబాబుకు లబ్ది చేకూరుస్తాయా..? అనేదే ప్రశ్న. వాస్తవానికి పంచాయతీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అప్పుడు లేని ధైర్యం ఇప్పుడెందుకో..
నిజానికి ఈ పంచాయతీ ఎన్నికలు జరగాల్సింది 2018లో. అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ ఎన్నికలకు సుముఖంగా లేరు. అప్పటికి సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ఏడాది సమయం ఉంది కూడా. అయినా.. టీడీపీకి, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఆయనకు తెలిసు కాబట్టే వెనకడుగు వేశారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో జరిగింది కూడా ఇదే. కానీ.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి గెలుపు తీరాల వైపు చూస్తున్నారు. నిజానికి టీడీపీపై ఉన్న వ్యతిరేకత అంత సామాన్యంగా పోయేది కాదు. అదే గ్రామాల ఓటర్లు టీడీపీ వైపు చూడకపోవడానికి అధికారంలో ఉండగా స్థానిక నాయకులు, జన్మభూమి కమిటీల తీరే. ప్రస్తుతం టీడీపీకి స్థానిక నాయకత్వం బలంగా లేదు. క్షేత్రస్థాయిలో పుంజుకోవడానికి టీడీపీ శ్రమించాల్సిందే. జగన్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లవుతోంది. మీడియా సపోర్ట్ ఉందనే ధీమాతో ఇప్పుడే జగన్ పై వ్యతిరేక ముద్ర వేసినా టీడీపీకి వర్కౌట్ కానిది. ప్రస్తుతం సీఎం జగన్ సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్నారు. పంచయతీ ఓటర్లకు ఇవే కనపడే అవకాశాలు ఎక్కువ. మరి.. ఓటర్ల నాడి పట్టుకోవడం ఎవరి తరం కాదు అనే మాట కూడా ఉంది. కాబట్టి.. ఈ పంచాయతీ ఎన్నికలు ఏం చెప్తాయో చూడాల్సిందే.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?