హైదరాబాదు, ఏప్రిల్ 20 : తెలంగాణలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూలు శనివారం విడుదలైంది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ఎన్నికల షెడ్యూలను ప్రకటించారు.
షెడ్యూలు ప్రకారం మూడు విడతల్లో మే ఆరవ తేదీ తొలి విడత, మే 10న రెండో విడత, మే 14న మూడో విడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
మే 27న ఓట్ల లెక్కింపు చేపడతామని నాగిరెడ్డి చెప్పారు.
రాష్ట్రంలో మొత్తం 539 జడ్పిటిసి స్థానాలు ఉండగా… ఒక స్థానానికి మాత్రం ఎన్నికలు జరగడం లేదని ఆయన అన్నారు. మొత్తం 538 జడ్పిటిసి, 5817 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఈసారి ఆన్లైన్లో విధానంలోనూ నామినేషన్ దాఖలుచేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చు. అయితే ఆ తర్వాత అభ్యర్థులు తమ నామినేషన్ హార్డ్కాపీలను రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది.సర్పంచ్, వార్డు మెంబర్లు కూడా జడ్పిటిిసి, ఎంపిటిసి ఎన్నికల్లో పోటీచేయవచ్చనీ, అయితే, ఫలితాల తర్వాత వారు తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుందని నాగిరెడ్డి తెలిపారు.
40 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని చెప్పారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల లోని 15 ఎంపిటిసి స్థానాలకు వచ్చే ఏడాది మే నెలలో టర్మ్ ముగుస్తుందనీ, భద్రాచలం జిల్లాలోని బుర్గంపాడులో 11 ఎంపిటిసి స్థానాలకు వచ్చే ఏడాది జులైతో టర్మ్ ముగుస్తుందనీ, లీగల్ కారణాల వల్ల ములుగులోని 14 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని వివరించారు.
ఎన్నికల భద్రత కోసం 26 వేల మంది భద్రతా సిబ్బందిని నియమించినట్లు నాగిరెడ్డి తెలిపారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?