(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తా విభాగం)
వాషింగ్టన్ డీసీ : అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తర్వాతి అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్ ఒక మధ్యవర్తిత్వ కంపెనీని ప్రారంభించాలని నిర్ణయించారు. ‘ది డొనాల్డ్ మీడియేషన్ సర్వీసెస్ కంపెనీ’ పేరుతో మధ్యవర్తిత్వ వ్యాపార సంస్థను ఆయన నెలకొల్పనున్నారు.
అమెరికాకు 45వ ప్రెసిడెంట్ గా ఉన్న ట్రంప్ మీడియేషన్ సర్వీసెస్ తో మరింత పాపులర్ కావాలని ఆకాంక్షిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో భేటీ అయినప్పుడు కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం నెరపుతానని ఆఫర్ ఇచ్చారు. తాలిబన్లతో ఇమ్రాన్ ద్వారా ఇప్పటికే ట్రంప్ మీడియేషన్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. మెక్సికో, అమెరికా సరిహద్దుల్లో 3,200 కిలోమీటర్ల మేర గోడ నిర్మించేందుకయ్యే మొత్తం 23 బిలియన్ డాలర్లను వివిధ దేశాల మధ్య మధ్యవర్తిత్వాలు చేసి సంపాదించాలన్నది ట్రంప్ ఆలోచనగా ఉంది. మధ్యవర్తిత్వాలు కొనసాగిస్తే అమెరికాలో మళ్లీ షట్ డౌన్ విధించవలసిన అగత్యం కూడా ఉండదని ఆయన విశ్వసిస్తున్నారు.
మధ్యవర్తిత్వం అన్నది దేశాల మధ్యే కాకుండా మున్ముందు అవసరమైతే నిత్యం పోట్లాడుకునే భార్యాభర్తలు, అన్నదమ్ములు, ఇరుగు పొరుగుల మధ్య కూడా జరిపేలా ట్రంప్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ప్రపంచమంతా తిరిగి పంచాయతీలు పెట్టి జగడాలను పరిష్కరించడం వల్ల మంచి పేరు కూడా వస్తుందని, ‘బతుకు జట్కాబండి’ వంటి టీవీ రియాలిటీ షోలు కూడా చేయవచ్చని ట్రంప్ తలపోస్తున్నారు. ట్రంప్ కు టీవీ రియాలిటీ షోల నిర్వహణలో కూడా మంచి అనుభవం ఉన్న సంగతి తెలిసిందే. దీని వల్ల తర్వాతి ఎన్నికల్లో ఓడినా మీడియేషన్ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవచ్చని ట్రంప్ భావిస్తున్నారు.
కశ్మీర్ విషయంలో తన మీడియేషన్ ప్రతిపాదన తర్వాతే భారత్ హడావుడిగా ఆర్టికల్ 370ని రద్దు చేసిందని ట్రంప్ ఒక ట్వీట్ లో వ్యాఖ్యానించారు. అలా ఒకరకంగా కశ్మీర్ సమస్యకు తానే ఒక మార్గం చూపినట్లయిందన్నారు. తన మీడియేషన్ ప్రతిపాదన ఫలించిందనడానికి ఇంతకంటే ఇంకేం రుజువులు కావాలని ఆయన ప్రశ్నించారు. అమెరికాలో శ్వేతజాత్యహంకారపు కాల్పుల ఘటనలు జరక్కుండా కూడా మీడియేషన్ చేస్తానని ఆయన ప్రకటించారు. ఇదిలావుండగా ట్రంప్ మీడియేషన్ సర్వీసెస్ అన్నది అపరిపక్వ నిర్ణయమని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ, డెమెక్రటిక్ నేత, సెనెటర్ చక్ చుమెర్ వ్యాఖ్యానించారు. గోడ డబ్బు కోసం ట్రంప్ మీడియేషన్ సర్వీసెస్ ప్రారంభించడాన్ని వారు ఎద్దేవా చేశారు. కాగా, పాకిస్థాన్ మాత్రం ట్రంప్ మీడియేషన్ సర్వీసెస్ ను స్వాగతిస్తున్నట్లు ప్రకటించింది.